జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు, కేసీఆర్ ఆరా, జగన్ ఇలా
చెన్నై/అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ఆరా తీశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కూడా జయ త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు.
'పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా' అని ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. అపోలో ఆస్పత్రిలో ఉన్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమెను సాధారణ వార్డు నుంచి సీసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Praying for the speedy recovery of Puratchi Talaivi J. Jayalalitha.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 5, 2016
కాగా, అపోలో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
సోమవారం తమిళనాడులో పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతా దళాలు మోహరించాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చే బస్సులు కూడా నిలిపివేశారు. జయలలిత కోలుకోవాలని దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.