దేశ రాజకీయాల వైపు మళ్లీ చంద్రబాబు చూపు..!
Recommended Video
బీజెపి ప్రభుత్వం నుండి బయటకు వచ్చాక ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్రుష్టి జాతీయ రాజకీయాలపైపు మళ్లినట్టు తెలుస్తోంది. కర్నాటక లో కుమార స్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లిన చంద్రబాబు హుషారుగా కనిపించారు. జాతీయ రాజకాయాల గురించి, బీజేపి కి వ్యతిరేకంగా మూడవ కూడమి గురించి మమతా బెనర్జీ, కేజ్రీవాల్, శరద్ పవార్, సీతారాం ఏచూరి, దేవెగౌడ తో ప్రత్యేక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఎన్డీయె కూటమికి వ్యతిరేకంగా చంద్రబాబు మంతనాలు,
జాతీయ రాజకీయాల పై తనకు ఆసక్తిలేదని గత కొంత కాలంగా చెబుతూ వస్తోన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిలో ప్రస్తుతం మార్పు కనిపిస్తోంది. బీజేపీతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్న తర్వాత జాతీయ రాజకీయాల అంశంలో బాబు ఆలోచన మారినట్టు అర్థమవుతోంది. తాజాగా బాబు బెంగుళూరు పర్యటనలో ఈ విషయం స్పష్టంగా వెల్లడైంది. కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఉదయమే బెంగుళూరు చేరుకున్న చంద్రబాబు ఫుల్ బిజీబిజీగా గడిపారు. మమత బెనర్జీ, మాయావతి, కేజ్రీవాల్, సురవరం లాంటి హేమాహేమీ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు.
బీజేపికి దూరంగా.. కాంగ్రేస్ కు చేరువగా..
ఎన్డీయేకు, మోడీకి వ్యతిరేకంగా ఈ భేటీలలో కీలక చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు అందరం ఏకమవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలే కీలకంగా కూటమికట్టాలని భావించినట్టు తెలిసింది. చర్చల్లో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్థావన పెద్దగా లేదు. అయితే, అంతిమంగా కాంగ్రెస్ కూడా కూటమిలో భాగస్వామిగా ఉండే అవకాశం ఉంది. మొదట్లోనే కాంగ్రెస్ వేదికగా కూటమి రూపకల్పన చేయకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబుకు ప్రాధాన్యత ఇవ్వని మోదీ, తిరగబడ్డ బాబు..
ఇక చంద్రబాబుకు బెంగుళూరులో అడుగుపెట్టగానే తొలిసారిగా విచిత్ర అనుభవం ఎదురైంది. చంద్రబాబు కాబోయే ప్రధాన మంత్రి అంటూ స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీనిని బట్టే జాతీయ రాజకీయాల్లో ముందు ముందు టీడీపీ వైఖరి ఎలా ఉండబోతోందన్నది అర్థమవుతోంది. ఎన్డీయేలో ఉన్నప్పుడు మోడీలో అభద్రతను తొలగించడానికి చంద్రబాబు అనేక ప్రయత్నాలు చేశారు. కొన్ని సందర్భాల్లో తన స్థాయిని కూడా పక్కన పెట్టి తగ్గి వ్యవహరించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చేది లేదని పదే పదే మోడీకి వివరణ ఇచ్చుకున్నారు. అయినా, మోడీ అండ్ కో చంద్రబాబు విషయంలో ఎందుకో అంటీముట్టనట్టు వ్యవహించింది.
థర్డ్ ఫ్రంట్ పట్ల చంద్రబాబు జోక్యం కోసం నేతల ఎదురు చూపు..
ఇక బీజేపీకి గుడ్ బై చెప్పడంతో తాజాగా బాబు దృష్టి జాతీయ రాజకీయాల పై పడింది. వచ్చే ఎన్నికల్లో కొత్త కూటమికి ఆయన బెంగుళూరు వేదికగా శ్రీకారం చుట్టినట్టుగానే కనిపిస్తోంది. అయితే, 2019లో ఆ కూటమికి ప్రధాని అభ్యర్థిగా చంద్రబాబే ముందుకు వస్తారా... లేక గతంలో మాదిరిగా మరెవరినైనా అభ్యర్థిగా అందరూ కలిసి నిర్ణయిస్తారా అన్నది వేచి చూడాలి.