రేపు ఢిల్లీని శాసించేది మేమే, 20న నిరాహార దీక్ష: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Recommended Video
గుంటూరు: తెలుగుదేశం సత్తా ఎంతో దేశానికి చూపుతామని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర సమస్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టంచేశారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలం శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేడ్కర్ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు.
నమ్మకద్రోహం.. 20న దీక్ష
హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును, ప్రతిపక్షాల వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీల సాధన కోసం ఏప్రిల్ 20న ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో ఏప్రిల్ 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఢిల్లీని శాసించేది టీడీపీనే
వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని అన్నారు. తాను పోరాడుతున్నది కేంద్రంపైన, నరేంద్ర మోడీపైన అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పామని, భవిష్యత్తులోనూ చక్రం తిప్పుతామని అన్నారు. తాను ఈ నెలలోనే పుట్టానని, ఏప్రిల్ 20న ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
కారణం మోడీ ప్రభుత్వం కాదా?
ప్రధాని మోడీ కూడా మొన్న పార్లమెంట్ జరగలేదని నిరాహార దీక్ష చేశారన్నారు. పార్లమెంట్ జరగపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిరాహార దీక్షతో కేంద్రానికి తన నిరసన తెలియజేస్తానన్నారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
20న దీక్ష.. 30న బహిరంగ సభ.. కడిగేస్తాం
నాలుగేళ్ల కంటే ముందు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. దాన్ని అమలుచేసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. ఆయన ఇచ్చిన హామీలను దేశానికి గుర్తుచేయాలన్నారు. హక్కుల కోసం పోరాడేందుకే ఏప్రిల్ 30న పెద్ద మహాసభ పెడుతున్నామన్నారు. ప్రతిఒక్క ఇంట్లో దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు ఆరోపించారు.
ఆ ఘనత మాదే
రాజ్యాంగం ఎంత మంచిదైనా.. దాన్ని అమలు చేసే వారి చిత్తశుద్ధిపైనే ఆధాపడి ఉంటుందని అంబేడ్కర్ ఆనాడే స్పష్టం చేశారని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు అన్నారు. అంబేడ్కర్గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. దళితులకు తొలిసారిగా పక్కాఇళ్లు కట్టించిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. కేఆర్నారాయణన్ను రాష్ట్రపతి చేయడంలోనూ ఆనాడు చొరవచూపామని, దళితులను చైతన్యవంతం చేసేందుకు, రాజకీయంగా బలోపేతం చేసేందుకు తాము కృషిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు రూ.15లక్షలతోపాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ రక్షణ కోసం దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు.