రవిశంకర్ గురూతో బాబు ఏకాంత భేటీ: మోడీని అటు నుంచి నరుక్కొస్తారా...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, శ్రీశ్రీ రవిశంకర్ గురూజీకి మధ్య గంటన్నర పాటు సాగిన ఏకాంత భేటీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ భేటీలో కీలకమైన విషయాలపై చంద్రబాబు రవిశంకర్తో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి తగినంత సాయం రాబట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీని సుముఖం చేయడానికి రవిశంకర్ కీలక భూమిక పోషించేలా చంద్రబాబు ఒప్పించారని అంటున్నారు.
చంద్రబాబు నివాసంలో ఆ భేటీ జరిగింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ గురూజీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే కృష్ణా పుష్కరాలకు రావలసిందిగా రవిశంకర్ గురూజీని రాష్ర్ట ప్రభుత్వం ఆహ్వానించింది. చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు రవిశంకర్ గురూజీ తన శిష్యులతో కలిసి విజయవాడ వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పున్నమి ఘాట్లో స్నానమాచరించారు. అటు పిమ్మట కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమానికి చేరుకున్నారు. కృష్ణమ్మకు ఇచ్చే పవిత్రహారతి కార్యక్రమాన్ని ఆస్వాదించారు. పుష్కర ఏర్పాట్లను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న చంద్రబాబును అభినందించారు..
తన ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా రవిశంకర్ను చంద్రబాబు అభ్యర్థించారు.. చంద్రబాబు ఆహ్వానాన్ని మన్నించి ఆ మరుసటి రోజే చంద్రబాబు ఇంటికి వచ్చారు. ఆ సందర్భంలోనే ఇరువురి మధ్య ఏకాంత భేటి జరిగింది. రాష్ట్రానికి సాయపడాలని రవిశంకర్ గురూజీని చంద్రబాబు కోరారు. సంతోషంగా ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తానని చంద్రబాబుకు మాట ఇచ్చారు.
కేంద్రం నుంచి అందుతున్న సాయం, రాష్ట్ర విభజన, ఫలితంగా వచ్చిన కష్టాలు వంటి అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీకి రవిశంకర్ గురూజీ సన్నిహితులు, ఆ కారణంగా ఇటువైపు నుంచి నరుక్కుని వచ్చి కేంద్రం సాయం అధికంగా వచ్చేలా చూడాలని చంద్రబాబు భావించి ఉంటారని అంటున్నారు.