చంద్రబాబు మరో డ్రామాకి తెరతీశారు:ఎంపి జివిఎల్;24 గంటల్లో కేసు వాపసు తీసుకోవాలి:సోమిరెడ్డి
విజయవాడ:ఓటుకి నోట్ లోబహిరంగంగా పట్టుబడిన చంద్ర బాబు...దాని నుంచి బయటపడే క్రమంలో ఇప్పుడు మరో డ్రామాకి తెర తీశారని బిజెపి ఎంపి జివిఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఒక దొంగ డ్రామాకు తెరతీశారని...దొంగ సింపతీ కోసం బాబు ప్రయత్నిస్తున్నారని ఎంపి జివిఎల్ ఆరోపించారు. గతంలోబాబ్లీ వెళ్లి కాంగ్రెస్ చేతిలో చంద్రబాబు భంగపడ్డారని...అది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందనే విషయం గుర్తుచేసుకోవాలన్నారు. ఇప్పుడు తనను కూడా ఏ వన్,ఏ టూ అని పిలుస్తారని భయమా?...అందుకేనా దొంగ డ్రామా? ...అని ఎద్దేవా చేశారు. దొంగ సింపతీ కోసం బాబు ప్రయత్నిస్తున్నారన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు కేసులో చంద్రబాబుకు నోటీసులపై తెలుగుదేశం నేతలు మరోసారి డ్రామాలకు తెరతీశారని బిజెపి ఎంపి జివిఎల్ చెప్పారు. కోర్టు నోటీసులు అదొక న్యాయ ప్రక్రియ మాత్రమేనని...న్యాయంనుంచి ఎవరు తప్పించుకోలేరని అన్నారు. చంద్రబాబుపై బీజేపీ కక్ష సాధింపు అవసరం లేదని...ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారన్నారు.పిడి అకౌంట్స్ విషయంలో విచారణ జరిపితే బాబు అవినీతి భాగోతం బయటకు వస్తుందని పునరుద్ఘాటించారు.అయినా చంద్రబాబు నోటీస్ లు చూసి భయపడే రకం కాదన్నారు. అయినా వాటిని అడ్డుపెట్టుకొని పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి విషయాల్లో న్యాయపోరాటం చెయ్యాలే తప్ప...న్యాయవ్యవస్థపై బురద చల్లడం సరికాదని హితవు పలికారు .
గతంలో ఈ కేసు విషయమై 22 నోటిస్ లు ఇచ్చినా స్పందన లేదని...అందుకే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారని వివరించారు.అదో న్యాయ ప్రక్రియగానే చూడాలన్నారు.ఒకవైపురాహుల్ ని వాటేసుకుని చంద్రబాబు డ్యూయెట్ లు పాడుకుంటున్నారని...మరి వారి కాంగ్రెస్ హయాంలోనే ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు.నీటిపారుదల ప్రాజెక్ట్ పై బాబుకు ఎప్పుడు చిత్త శుద్ధి లేదని...ఆయన నీటి కోసం పోరాడటం ఏమిటన్నారు. ఇక సినిమా నటుడు శివాజీ కి వేషాలు లేకపోవడం వల్లే...ప్యాకేజీ తీసుకొని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ ఇవ్వడం దారుణమని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా ఉద్యమాలు చేస్తే నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్తో పాటు విపక్ష నేతలకు మోడీ ప్రభుత్వం నోటీసులు ఇస్తోందన్నారు. 24 గంటల్లో ఈ కేసు వాపసు తీసుకోకుంటే ప్రజాగ్రహం తప్పదని మంత్రి సోమిరెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇవ్వాలని ఉద్దేశంతోనే సీఎంకు వారెంట్ ఇచ్చారని సోమిరెడ్డి ఆరోపించారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ అడ్డుకోలేకపోయారని మంత్రి సోమిరెడ్డి విమర్శించారు.