'సీమ'పై బాబు స్కెచ్, వైసిపిలో వికెట్ డౌన్!: నాడు శోభకు ప్రాధాన్యం..
కర్నూలు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీలో చేరవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. భూమా ఫ్యామిలి టిడిపిలో చేరితే టిడిపికి ఎంతో లాభకరమేనని చెప్పవచ్చు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటలేకపోయింది. మిగతా జిల్లాల్లో సైకిల్ హవా కనిపించింది. కానీ ఈ మూడు జిల్లాల్లో మాత్రం తేలిపోయింది. దీంతో, 2019లోను మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు.
తెలంగాణలో టిఆర్ఎస్ తమ పార్టీని ఆకర్షించినట్లుగా ఏపీలో ప్రతిపక్ష వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేరనున్నారని తెలుస్తోంది. తాజాగా కర్నూలు నుంచి భూమా కుటుంబం కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైందంటున్నారు.
2019 నాటికి కడప, కర్నూలులో జిల్లాలో టిడిపి హవా కోసం చంద్రబాబు ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగా వారిని చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. కడప, కర్నూలులో టిడిపికి బలం తక్కువగా ఉన్నందున దానిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నారు.
25 తర్వాత వైసిపిలోకి భూమా నాగిరెడ్డి
ఈ నెల 25 తర్వాత భూమా నాగిరెడ్డి పార్టీ మారవచ్చని, రెండు, మూడు రోజుల్లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో సమావేశమవుతారని జిల్లాలో వదంతులు గుప్పుమంటున్నాయి. పార్టీ మారడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భూమా అనుచరులు చెబుతున్నారు.
అందరూ శోభా నాగిరెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు
భూమా కుటుంబం మొదట తెలుగుదేశం పార్టీలో ఉంది. భూమా స్థానికంగా చక్రం తిప్పగా... ఆయన సతీమణి శోభా నాగిరెడ్డి కూడా రాజకీయాల్లో బాగా రాణించారు. గతంలో వీరు టిడిపిలో ఉన్నప్పుడు.. శోభా నాగిరెడ్డి చొరవతో చంద్రబాబు పలు సమస్యలను పరిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు.
రాజకీయాల్లో ఆమె బాగా రాణించారు. శోభా నాగిరెడ్డి రాజకీయాల్లో తనను తాను నిరూపించుకున్నారు. ఆమె టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు భూమా కుటుంబానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత వీరు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. చిరు కూడా శోభకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
ఆ తర్వాత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వైసిపిలో చేరారు. జగన్కు శోభా నాగిరెడ్డి ఎన్నో సందర్భాలలో అండగా నిలిచారు. పార్టీ ఏది అయినా.. తాను ఉన్న పార్టీ కోసం ఆమె ఎంతో నిబద్దతతో పని చేస్తారంటారు. అందుకే చంద్రబాబైనా, చిరు అయినా, జగన్ అయినా ఆమెకు ప్రాధాన్యత ఇచ్చేవారు.
అంతేకాదు, కర్నూలులో వారికి ఉన్నపట్టు కూడా కారణం. కాగా, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేసిన ఆళ్లగడ్డ నుంచి ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కూతురు అఖిల ప్రియ పోటీ చేసి గెలిచారు.
నంద్యాల నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిల ప్రియ టిడిపిలోకి వెళ్తారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. భూమా కుటుంబానికి జిల్లాలో మంచి పట్టు ఉంది. వీరు టిడిపిలో నిజంగానే చేరితే వైయస్ జగన్ పార్టీలో పెద్ద వికెట్ డౌన్ అయినట్లే. అది ఆ పార్టీ పైన కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.