అనివార్యంగా జగన్ బాటలో చంద్రబాబు- పార్టీని బతికించుకునేందుకు- వైసీపీ తరహాలోనే..
నాలుగుదశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉనికి కోసం పోరాడుతోంది. ముఖ్యంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కుదురుకున్నట్లే కనిపించిన టీడీపీ.. గతేడాది ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంతో ఘోర పరాజయం చవిచూసింది. ఆ తర్వాత పార్టీకి కీలక నాయకులు దూరమవుతుండటం, పార్టీలో కొత్త రక్తం నింపేందుకు సరైన ప్రయత్నాలు జరగకపోవడంతో పలు జిల్లాల్లో టీడీపీ బలహీనంగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల విధానానికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోవడం కూడా టీడీపీకి మైనస్గా మారింది. దీంతో పార్టీలో తిరిగి జవసత్వాలు నింపేందుకు అధినేత చంద్రబాబు ప్రక్షాళనకు సిద్ధమయ్యారు. అయితే ఇది గత ఎన్నికలకు ముందే వైసీపీ విజయవంతంగా పరీక్షించిన మోడల్ కావడం విశేషం..
మత కల్లోలాలకు చంద్రబాబు తపన- దేవాలయ ఘటనలు టీడీపీ పనే - బొత్స కామెంట్స్...
నానాటికీ బలహీనంగా టీడీపీ...
గత ఎన్నికల్లో పదేళ్ల రాజకీయ అనుభవం కూడా లేని వైసీపీ చేతిలో ఎదురైన ఘోర పరాజయం టీడీపీని శరాఘాతంగా మారిపోయింది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత కూడా టీడీపీని కుదురుకోనివ్వకుండా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ అనుసరిస్తున్న కౌంటర్ వ్యూహాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. అంతలోపే కరోనా రావడం, అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ హైదరాబాద్ వెళ్లిపోవడం ఏడు నెలలుగా అక్కడే ఉండిపోవడంతో పార్టీలో ఎన్నడూ లేనంత దారుణమైన నిస్తేజం కనిపిస్తోంది. ఇదే పరిస్ధితి మరికొన్నాళ్లు కొనసాగితే పార్టీ నుంచి వైసీపీలోకి జంపింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయన్న ప్రచారం సాగుతోంది. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనికి చంద్రబాబు తెరలేపుతున్నారు. ఇవాళ పార్టీ జిల్లా కమిటీల ప్రకటన కూడా ఇందులో భాగమే.
వైసీపీ సక్సెస్ మోడల్...
టీడీపీ ఆవిర్భావం నుంచి మిగతా పార్టీల తరహాలోనే జిల్లాల వారీగా కమిటీలు, అధ్యక్షులను నియమించే విధానం కొనసాగింది. ఇప్పటికీ టీడీపీ అదే పద్ధతిలో జిల్లా కమిటీలను ప్రకటిస్తోంది. మిగతా పార్టీల్లో వైసీపీ మినహా ఇతర పార్టీలు కూడా ఇప్పటికీ అదే మోడల్ కొనసాగిస్తున్నాయి. కానీ గత ఎన్నికలకు ముందే వైసీపీ పార్టీలో సంస్ధాగత మార్పులకు తెరదీసింది. మారుతున్న పరిస్ధితుల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు జిల్లా పార్టీల విధానం పనికిరాదని గ్రహించింది. అందుకే దాని స్ధానంలో పార్లమెంటు స్ధానాలను యూనిట్గా తీసుకుని కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ వైసీపీలో 25 పార్లమెంటు సీట్ల వారీగా అధ్యక్షులున్నారు. వీరినే పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో పార్లమెంటరీ జిల్లా కమిటీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు టీడీపీ కూడా ఇదే విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది.
వైసీపీ కంటే మెరుగ్గా కమిటీలు...
కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలకు ఎవరు చేరువగా ఉంటారో వారికే ప్రజలు పట్టం కడుతున్నారు. పదవులు తీసుకుని ఆఫీసులు, ఇళ్లకు పరిమితమయ్యే పార్టీలను, నేతలను జనం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని వైసీపీ గత ఎన్నికలకు ముందే గ్రహించింది. అందుకే పార్లమెంటరీ సీట్ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని సక్సెస్ అయింది. ఇప్పుడు టీడీపీ ఈ మోడల్ను కాపీ కొడుతున్నట్లుగా కాకుండా మరింత బెటర్ మోడల్లో ముందుకొచ్చేందుకు తీవ్ర కసరత్తు చేసింది. చివరికి పార్లమెంటరీ సీట్ల వారీగా కమిటీలను, అధ్యక్షులను ప్రకటిస్తూనే, వారిపై మరికొందరు ఇన్ఛార్జ్లను నియమిస్తోంది. దీంతో 25 లోక్సభ సీట్లలో పార్లమెంటరీ అధ్యక్ష పదవులతో పాటు రెండు జిల్లాలకో సమన్వయకర్త చొప్పున మరో 13 మందిని, అలాగే ప్రతీ జిల్లాలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవులను ప్రకటించబోతోంది. ఈ లెక్కన మొత్తం 51 మందికి టీడీపీ పదవులు అప్పగించబోతోంది.
Recommended Video
ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం...
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ పార్టీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అధినేత ఉండి కూడా పాత చింతకాయ వ్యూహాలను అనుసరించి గతేడాది ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న టీడీపీకి ఇప్పుడు అనుభవాలే పాఠాలవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అనుభవాలను ఫాలో కావడం ద్వారా పార్టీని ఏపీ రాజకీయ యవనికపై నిలబెట్టాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. మారిన పరిస్ధితుల్లో ప్రజలకు చేరువయ్యేందుకు వైసీపీ అనుసరించిన మోడల్నే ఫాలో అవుతూ ఆ పార్టీని దెబ్బకొట్టాలని నాయుడు గారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ కమిటీల ప్రయోగంతో వైసీపీ తమను గత ఎన్నికల్లో దెబ్బకొట్టిందనే అంచనాకు వచ్చిన టీడీపీ అధినేత ఇప్పుడు అదే మోడల్లో తాము కూడా కమిటీలను నియమించి ప్రజలకు మరింత చేరువ కావాలని వ్యూహరచన చేస్తున్నారు.