ఎవరూ తగ్గొద్దు, పంతంతో ఎత్తుకు పైఎత్తు!: చంద్రబాబుXరోజా, జగన్ స్కెచ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యవహారం దుమారం రేపుతోంది. ఎట్టకేలకు రోజాతోనే అసెంబ్లీలో అడుగు పెట్టారని వైసిపి ఎత్తు వేస్తుండగా, ఆమెను ఎలాగైనా సభలో అడుగు పెట్టకుండా చేసేందుకు ప్రభుత్వం పైఎత్తు వేస్తోంది. పరస్పరం నోటీసులు, కోర్టులకు వెళ్తామంటూ చెబుతున్నారు.
శుక్రవారం జగన్, వైసిపి నేతలు మాట్లాడుతూ... తాము రోజాకు అండగా ఉంటామని, రోజాను ఒంటరిగా వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఆమెను సభకు అనుమతించే వరకు తగ్గేది లేదని చెబుతున్నారు. ఇందుకోసం తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను వైసిపి ఉపయోగించుకుంటోంది.
రోజాను సభకు రానివ్వకుంటే మరోసారి హైకోర్టుకు వెళ్లాలని వైసిపి భావిస్తోంది. మరోవైపు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కామినేని శ్రీనివాస రావు, అచ్చెన్నాయుడు, సీఎం చంద్రబాబులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
మరోవైపు, రోజా ఇష్యూపై ఓ వైపు కోర్టులో పోరాటం చేస్తూనే, ఇంకోవైపు సభలో ఆమెను అడుగు పెట్టకుండా శాసన వ్యవస్థ రూల్స్ను ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టిడిపి ఎమ్మెల్యే వనిత.. రోజా పైన అనుచిత వ్యాఖ్యల ఫిర్యాదు చేశారు. వీరికి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు పంపింది.
ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. రోజా వ్యవహారంలో ధీటుగా బదులివ్వాలని, తగ్గే ప్రసక్తి ఉండవద్దని చంద్రబాబు మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రోజా ఇష్యూలో అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి.
వైసిపి ఎమ్మెల్యే రోజా విషయంలో అధికార టిడిపి, ప్రతిపక్ష తెలుగుదేశం ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. పరస్పరం నోటీసులు, సభా హక్కుల ఉల్లంఘనలు, కోర్టులు అంటూ సవాళ్లు విసిరుకుంటున్నారు. హైకోర్టు తీర్పు రోజాకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆమె పైన టిడిపి ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేశారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ ముందు రేపు మధ్యాహ్నం వారు హాజరు కానున్నారు.
మరోవైపు, రోజా ఇష్యూలో అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అంబటి మాట్లాడుతూ... రోజాను చూసి ప్రభుత్వం భయపడుతోందని, శాసన సభ పరిధి దాటితో కోర్టులు జోక్యం చేసుకుంటాయని, రోజాపై చంద్రబాబుకు వ్యక్తిగత కక్ష అని ఆరోపించారు. సభలో తాను ఉన్నంత కాలం రోజా ఉండకూడదని చంద్రబాబు హుకూం జారీ చేశారని ఆరోపించారు. టిడిపి ధీటుగానే స్పందిస్తోంది. ఒకవిధంగా ఈ వివాదం చంద్రబాబు వర్సెస్ రోజాగా మారిందని అంటున్నారు.