జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి సీనియర్ నాయకుడు దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేవినేని ఉమ అక్రమ అరెస్ట్ ను చంద్రబాబు ఖండించారు. ప్రజల పక్షాన మాట్లాడితే దాడులు చేస్తారా అంటూ చంద్రబాబు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ ప్రోద్భలంతోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు .
Recommended Video
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉగ్రవాదం, జగన్ పాలనలో యువత భవిత అంధకారమయం : చంద్రబాబు ధ్వజం
దేవినేని అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు .. విడుదల చెయ్యాలని డిమాండ్
ప్రజల పక్షాన మాట్లాడిన సీనియర్ నేత దేవినేని ఉమాను అరెస్ట్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు, దేవినేని ఉమ తో పాటు ఇతర టిడిపి నేతలను తక్షణం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. దేవినేని ఉమ చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు చంద్రబాబు. దేవినేని ఉమా పై భౌతిక దాడులకు దిగుతామని చెప్పిన కొడాలి నానిపై చర్యలు ఎందుకు ఉండవని ప్రశ్నించిన చంద్రబాబు, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మంత్రి కొడాలి నాని బరితెగించి వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.
సీఎం జగన్ ప్రోద్బలంతోనే రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపై దాడులు
ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఎస్పీని, ఓ ఎమ్మెల్యే బహిరంగంగా బెదిరించారని పేర్కొన్న చంద్రబాబు, జగన్ హయాంలో రాష్ట్రం గుండాలకు అడ్డాగా మారిపోయింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డిది క్రూర స్వభావం అని, ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయని తత్వమని చంద్రబాబు విమర్శించారు. దేవినేని ఉమా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా దీక్ష చేస్తామంటే అక్రమంగా అరెస్టు చేయడాన్ని టిడిపి తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు చంద్రబాబు.
దేవినేనికి బడితపూజ చేస్తామన్న కొడాలి నానీపై కేసు పెట్టండి
దేవినేని ఉమా ఇంటికి వచ్చి బడిత పూజ చేస్తామంటూ నేరపూరిత వ్యాఖ్యలు చేసిన కొడాలి నానిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు అరెస్టు చేసిన టిడిపి నేతలను తక్షణం విడుదల చేసి, మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బరితెగించి మాట్లాడుతున్న వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు.