వైఎస్ జగన్ చేతిలో రాష్ట్ర పాలన..పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్న చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో తాజా పరిస్థితులపై మాట్లాడారు. ప్రభుత్వ పాలనా తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ చేతిలో పాలన... పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ విమర్శలు గుప్పించారు చంద్రబాబునాయుడు . రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా వైసిపి హయాంలో వేధింపులు పెరిగాయని మండిపడ్డారు. టిడిపి లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు వైసిపి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు
రాష్ట్రాన్ని నేరగాళ్ల రాజ్యం గా మార్చారు అని, ఎవరినీ స్వేచ్ఛగా బ్రతకనిచ్చేలా లేరంటూ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కుటుంబంతో సహా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎప్పుడూ చూడలేదని పేర్కొన్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో హత్యలు ,అత్యాచారాలు బాగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు ,అక్రమ నిర్బంధాలు ,కక్షసాధింపు చర్యలు తప్ప వైసిపి పాలనలో ఇంకేముంది అని ప్రశ్నించిన చంద్రబాబుప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు.
అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్యకు వేధింపులే కారణం
రాష్ట్రంలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన పోలీసుల వేధింపులు తట్టుకోలేక నంద్యాల లో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మశాంతి కోసం మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు చంద్రబాబు నాయుడు . దొంగతనం పేరుతో వేధించటం వల్లనే భార్యా పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు.
Recommended Video
ప్రజల ప్రాణాలు తీసే సర్కార్ రాజ్యమేలుతుంది
రాష్ట్రంలో శిరోముండనం ఘటనలు, హత్యలు , ఆత్మహత్యలు చేసుకునే దాకా వేధింపులు పెరిగాయని పేర్కొన్న చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీసే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆయన, నంద్యాల ఘటన దర్యాప్తు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మహత్యకు కారణమైన అధికారులను సర్వీస్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.