చంద్రబాబులో మార్పు: నేతలతో సెలబ్రేషన్స్, జగన్నూ వదల్లేదు!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులో ఇటీవల కాలంలో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రతీ కార్యక్రమంలో పార్టీ నేతలతో ఉత్సాహంగా పాల్గొంటూ అందరిలో కలిసిపోతున్నారు. దీంతో పార్టీ నేతల్లో కూడా కొత్త ఉత్సాహం వస్తోంది. ప్రజలకు, కార్యకర్తలకు అనుగుణంగా తాను నడుచుకుంటున్నానని గతంలో చంద్రబాబు అనేకమార్లు ప్రకటించుకున్నారు.
ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి వెళుతూ.. నాయకుడిగా తన ప్రాధాన్యాలు కూడా మార్చుకుంటున్నారు. ప్రజలు మెచ్చే పథకాలు, పనులకు పెద్దపీట వేయాలనే ధోరణిని కూడా తన అలవాటుగా మార్చుకున్నారు చంద్రబాబు. ఇటీవలి కాలంలో ఆయనలో మరింత మార్పు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేందుకు చేస్తున్న పనులు పార్టీలో నేతలను ఆయనకు మరింత దగ్గర చేస్తున్నాయి.
ఇటీవల ఏపీ టిడిపి నేత కొనకళ్ల నారాయణను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంబేద్కర్, జగ్జీవన్ రాం వంటి నేత లస్థాయికి కొనకళ్ల నారాయణరావు కూడా ఎదగాలి అంటూ వ్యాఖ్యానించారు. కొనకళ్ల ళ్ల జన్మదినం సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరైన పుట్టిన రోజు జన్మదినం చెప్పి ఊరుకుంటారు, కానీ చంద్రబాబు కొనకళ్లను ప్రశంసించడం గమనార్హం.
అంతేగాక, చంద్రబాబే.. స్వయంగా తన పార్టీ ఎంపీతో కేక్ కట్ చేయించి.. కేకు ముక్కను ఆయనకు తినిపించి మరీ ఈ వ్యాఖ్యలు చేయడం కొనకళ్లతోపాటు అక్కడివారిని ఆకట్టుకుంది. ఈ పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మారిన మనిషి అంటున్నారు పార్టీ నేతలు.
గతంలో పార్టీ నిర్వహణను కూడా ఒక కార్పొరేట్ కంపెనీ ఎడ్మిన్ హెడ్లాగా చూస్తూ వచ్చిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఆ నిర్వహణలోనే కాస్త ఉద్వేగం, అనుబంధాలు, ఆత్మీయతలు తదితర అంశాలను జత చేసి నేతలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. గతంలో ఇలాంటి కార్యక్రమాలపై అంతగా శ్రద్ద పెట్టని చంద్రబాబు.. ఇప్పుడు, తన సొంత పార్టీ నాయకుల పుట్టిన రోజులు వచ్చినా.. పార్టీ ఆఫీసులో తానే స్వయంగా దగ్గరుండి సెలబ్రేట్ చేయించడం విశేషం.
కాగా, చంద్రబాబు వైఖరిలో ఇది చాలా భిన్నంగా కనిపిస్తోందని సొంత పార్టీ నేతల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు బర్త్డేను కూడా చంద్రబాబు దగ్గరుండి చేయించారు. మరో మంత్రికి కూడా ఇలాంటి అపురూప అవకాశం దక్కింది.
అంతేగాక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నాడు కూడా చంద్రబాబునాయుడు తానే స్వయంగా శాసనసభలో జగన్ సీటు వద్దకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. అంతేగాక, శాసనసభ సమావేశాల్లోనూ చంద్రబాబునాయుడు కొత్త ఉత్సాహంతో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు చురకలు అంటించడం, సొంత పార్టీ నేతలను కలుపుకోవడం కనిపించింది.
కాగా, చంద్రబాబు తీరును నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ నేతలందరూ తమ నేత ప్రవర్తనపై ముచ్చపడుతున్నారు. ప్రజలతోనూ, పార్టీ నేతలతోనూ స్నేహపూర్వకంగా, ఉత్సాహంగా ఉంటూ చంద్రబాబునాయుడు మంచి వాతావరణాన్ని సృష్టిస్తున్నారని పార్టీ శ్రేణులు సంబరపడిపోతున్నాయి.