లాంచీ ప్రమాదం ..జనసైనికులూ , తెలుగు తమ్ముళ్ళూ కదలండి .. అధినేతల దిశానిర్దేశం
తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోదావరిలో లాంచీ మునిగిన ఘటనలో ఇప్పటి వరకు 8 మంది దుర్మరణం పాలు కాగా, 39 మంది గల్లంతయ్యారు. ఇక 26మంది సురక్షితంగా బయటపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదంలో నింపిన ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం స్పందించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహాయక చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
గోదావరిలో లాంచీ మునక ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ..
గోదావరిలో లాంచీ మునక ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ గోదావరి నది లో సుమారు 50 మంది గల్లంతయ్యారు అని తెలిసిందని, ఇది తనను ఎంతగానో బాధకు గురి చేసిందని తెలిపారు. గల్లంతైన వారి కోసం, పర్యాటకుల ఆచూకీ కోసం , అదే విధంగా ఇతర సహాయ కార్యక్రమాల కోసం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రమాద స్థలికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ చెప్పారు.
పవన్ ఆదేశంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్
పవన్ ఆదేశంతో తూర్పు గోదావరి జిల్లా జనసైనికులు ప్రమాద స్థలికి తరలి వెళ్లారు. బాధితులకు తమ వంతు సాయం చేస్తూ , అక్కడ ఉన్న వారికి సహకారం అందిస్తూ సహాయక చర్యలలో పాల్గొన్నారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోదావరి నదిలో పాపికొండలు పర్యటనకు వెళుతున్న బోటు మునిగిన సంఘటన కలచివేసిందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురవడం చాలా బాధాకరంగా ఉందన్నారు.
తెలుగు తమ్ముళ్ళకు ప్రమాద స్థలికి వెళ్లాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు
మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వం సత్వరమే గాలింపు చర్యలు ముమ్మరం చేసి గల్లంతైన వారిని కాపాడాలని ఆయన కోరారు. అలాగే తెలుగు తమ్ముళ్లను కూడా ప్రమాద స్థలికి వెళ్లాలని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఇక ఈ ఘటనపై ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్పందించిన మోడీ .. సహాయక చర్యలు సాగుతున్నాయన్న ప్రధాని
అత్యంత బాధాకరమైన ఘటనగా మోడీ లాంచీ మునక ఘటనని పేర్కొన్నారు. తన ట్విట్టర్ ఖాతాలో తెలుగులో ట్వీట్ చేసిన ఆయన ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు నా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి అని ఆయన తెలిపారు. ఇక బోటు ప్రమాద ఘటనపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్ తమిళ సై , రాహుల్ గాంధీ తో పాటు పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రమాద స్థలిలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.