ఒక్కసారిగా టెన్షన్: చంద్రబాబు పూజలు చేస్తున్న వేళ హడలెత్తించిన పాము..
ఘాట్లో నుంచి పాము వెళ్లిపోయిన తర్వాత.. సీఎం చంద్రబాబు ప్రశాంతంగా పూజలు నిర్వహించారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా, గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు నిర్వహిస్తున్న వేళ.. ఓ పాము కలకలం రేపింది. సీఎం పూజలు చేయాల్సిన ఘాట్ లోనే పాము కనిపించడంతో.. భద్రతా సిబ్బంది కొంత కంగారు పడ్డారు. అయితే పాము నీటిలోంచి ఈదుకుంటూ వెళ్లిపోవడంతో అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేకుండా పోయింది.
ఘాట్లో నుంచి పాము వెళ్లిపోయిన తర్వాత.. సీఎం చంద్రబాబు ప్రశాంతంగా పూజలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో సంగమం తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల సంగమం విశిష్టతను తెలిపే గీతానికి అంతరాయం ఏర్పడింది. సీఎం భద్రతా రీత్యా అధికారులు మొబైల్ జామర్లు ఏర్పాటు చేయడంతో ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ధ్వని వ్యవస్థకు యాంటీనాలకు మధ్య సిగ్నల్స్ ఆగిపోయాయని చెబుతున్నారు.
Recommended Video
పూజానంతరం సీఎం ప్రసంగిస్తున్న సమయంలోను సాంకేతిక సమస్యలు ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డాయి. అయితే జామర్లను కాసేపు ఆపివేయడంతో సమస్య పరిష్కారమైంది. ఆపై సంగమ విశిష్టత గురించి ప్రసంగించిన చంద్రబాబు.. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో అక్కడి అధికారులు జేసీ గంధం చంద్రడు, దుర్గగుడి ఈఓ సూర్యకుమారిలు కాస్తంత ఆందోళన చెందినప్పటికీ.. చివరకు అంతా సజావుగా సాగడంతో 'హమ్మయ్యా' అనుకున్నారు.