కలుద్దామంటూ చింతమనేనికి చంద్రబాబు ఫోన్: ఏం చెప్పారంటే..
అమరావతి: ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఫోన్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు పెడుతున్న అక్రమ కేసులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.
జగన్ సర్కారు కక్ష సాధింపు..
చింతమనేని ప్రభాకర్ శనివారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగానే అనేక కేసులు పెట్టారని, కేవలం ఈ 5 నెలల్లోనే పనిగట్టుకుని చింతమనేనిపై 11 కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
కలుద్దామంటూ చింతమనేకి అండ..
9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం కన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్ని విధాలా టీడీపీ అండగా ఉంటుందని చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కలుద్దామని ఆయన చెప్పుకొచ్చారు.
ఏం చేశానని ఇన్ని కేసులు..
కాగా, ఏలూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 66 రోజుల రిమాండ్ అనంతరం ఏలూరు సబ్ జైలు నుంచి చింతమనేని ప్రభాకర్ విడుదలయ్యారు. విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎం చేశానో సీఎం వైఎస్ జగన్ సర్కారు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఏ ద్రోహం చేశానని 18 కేసులు పెట్టారని మండిపడ్డారు.
జైల్లో కుళ్లబొడిపించారు..
తనపై పెట్టిన అక్రమ కేసులన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
దళితులను ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురిచేసి తనపై కేసులు పెట్టించారని చింతమనేని ఆరోపించారు. జగన్ సర్కారు తనను జైల్లో పెట్టించి కుళ్లబొడిపించారని ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గంలో దళితులతో తాను మెలిగినంత స్నేహంగా మరే నేత మెలగలేదన్నారు.