నీటి కోసం బాబు ఉద్యమం!: 4న ధర్నా, అక్కడే దీక్ష
హైదరాబాద్: బ్రిజేష్ ట్రైబ్యునల్ తీర్పు నేపథ్యంలో కృష్ణా నీటి కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉద్యమ బాట పట్టనున్నారు! చంద్రబాబు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర ఢిల్లీ పెద్దలను కృష్ణా జలాల అంశంపై కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత 4వ తేదీన ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నాకు దిగే అవకాశాలున్నాయి. ధర్నా అనంతరం అక్కడే దీక్షకు దిగే అవకాశముంది.
కాగా, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సమర్థించిన విషయం తెలిసిందే. కృష్ణా జలాల పంపకంపై ట్రిబ్యునల్ శుక్రవారం తుది తీర్పు వెలువడింది. దీనిపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని, వైయస్ లేఖ వల్లనేనని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది.
వైయస్ ఎందుకు ప్రారంభించారో అర్థమౌతోంది: పయ్యావుల
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పథకాన్ని ఎందుకు ప్రారంభించారో ఇప్పుడు అర్థమవుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయన గుంటూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మిగులు జలాలపై కడుతున్న పదకొండు ప్రాజెక్టులు ఒట్టి కుండలేనని, మిగులు జలాలపై వైయస్ ఇచ్చిన లేఖ ఇవాళ రాష్ట్రానికి మరణ శాసనమైందన్నారు. నీటి పారుదల గురించి తెలియని న్యాయవాదితో ట్రైబ్యునల్లో వాదనలు వినిపించారని, ట్రైబ్యునల్ తీర్పుపై న్యాయ, నీటి పారుదల నిపుణులతో కమిటీ వేయాలని, కమిటీ సూచనల మేరకు సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నారు.