చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్.. విమర్శించిన విజయసాయి
ఏపీలో తాజాగా రాయిటర్స్ ఇండియా కథనంతో కియాపై కలకలం రేగింది . ఒకపక్క రాజధాని అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. కియా అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతుందంటూ రాయిటర్స్ పత్రికలో వచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్త చర్చకు , గందరగోళానికి కారణం అవుతుంది . ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని ఏపీ రాజకీయాలలో టీడీపీ, వైసీపీ నేతల మాటల దాడులు కొనసాగుతున్నాయి .
నిరాధార వార్తలకు సిగ్గు పడాలి.. కియా తరలింపు వార్తలపై మండిపడ్డ రోజా
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏ చిన్న అవకాశం దొరికినా విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు . ఇక రాయిటర్స్ పత్రికలో కియా మోటార్స్ గురించి కథనం రాయించింది చంద్రబాబే అన్నట్లు ఆయన ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.ఇక ఆయన చేసిన ట్వీట్ లో ఎంత పెద్ద అబద్ధమైనా రాయిస్తాడు చంద్రబాబు. అన్నింటికి తెగబడి పోయాడు. ఎల్లో మీడియా వార్తలు ప్రజలు నమ్మడం లేదని రాయిటర్ ఏజెన్సీ పేరుతో కియా వెళ్లిపోతుందని అభూత కల్పన సృష్టించాడు అంటూ నిప్పులు చెరిగారు .
ఇక అంతేకాదు ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులకు పాల్పడుతున్నాడు. బంగాళాఖాతం తీరం నుంచి దూరంగా జరిగిపోతోంది. నదులన్నీ వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి మిడతల దండు ఇటే వస్తోంది. ఆంధ్రా వైపు భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నట్టు నాసా హెచ్చరించింది లాంటి వార్తలు వస్తాయి త్వరలో అంటూ చంద్రబాబు అభూత కల్పనలు సృష్టించటంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. అంతే కాదు చంద్రబాబూ, ఐదు కోట్ల మంది ప్రజలతో గేమ్స్ ఆడుతున్నావ్! అంటూ విజయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు.