మరో 10 మందినైనా!: టాప్ లీడర్లంతా బాబుతో టచ్లో!, జగన్ యాక్షన్ లోకి దిగకపోతే కష్టమే?
ప్రత్యర్థి నిరుత్సాహంలో ఉన్నప్పుడే.. మరో కోలుకోలేని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video

మంగళగిరి: నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్టింగ్తో అధికార పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే సమయంలో ప్రత్యర్థి వైసీపీ కాస్త ఢీలా పడిన మాట వాస్తవమే. ప్రత్యర్థి నిరుత్సాహంలో ఉన్నప్పుడే.. మరో కోలుకోలేని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మేరకు ఆపరేషన్ ఆకర్ష్ ను మరోసారి వేగవంతం చేసి.. మరో 10 వైసీపీ నేతలను టీడీపీలోకి లాక్కోవాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. మంగళగిరిలో పార్టీ నేతలతో నిర్వహించిన వర్క్ షాపులో చంద్రబాబు తన అంతరంగాన్ని వెల్లడించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

టాప్ లీడర్లంతా టచ్ లోనే:
వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న చాలామంది టాప్ లీడర్లు తనతో టచ్ లో ఉన్నారని, వాళ్లు పార్టీలోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ముందు జాగ్రత్త చర్యగా చంద్రబాబు పార్టీ శ్రేణులకు విన్నవించినట్లు ప్రచారం జరుగుతోంది.
నంద్యాల, కాకినాడ ఓటమి రుచి చూసిన తర్వాత చాలామంది వైసీపీ నేతలకు భయం పట్టుకున్న మాట నిజమే అయినప్పటికీ.. బాబుతో వారు టచ్ లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అనేది తెలియదు. ఒకరకంగా ఇదంతా టీడీపీ మైండ్ గేమ్ అనేవారు లేకపోలేదు. ఈ మైండ్ గేమ్ దెబ్బకు వైసీపీ నేతలు చిక్కితే.. క్రమ క్రమంగా ఆ పార్టీ ఉనికిని దెబ్బతీయాలనే ఎత్తుగడ దీని వెనకాల ఉన్నట్లు తెలుస్తోంది.

సీనియర్ నాయకులకు బాధ్యతలు:
ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగడానికి కొంతమంది సీనియర్ నాయకులను చంద్రబాబు పురమాయించినట్లుగా చెబుతున్నారు. వైసీపీ నుంచి ఎవరొచ్చినా చేర్చుకోవాలనే రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దీంతో రానున్న రోజుల్లో వైసీపీ నుంచి ఎవరు అవుట్ అవబోతారనే దానిపై ఆసక్తి మొదలైంది.
రాజకీయ భవిష్యత్తుపై ఊగిసలాట మొదలైన వైసీపీ నేతలంతా ఈ ఆకర్ష్ వలలో చిక్కుకునే అవకాశం ఉంది. పదవుల పేరుతోను, ప్రలోభాలతోను.. మొత్తానికి నయానో, భయానో వీరందరినీ దారి తెచ్చుకోవాలనే ఎత్తుగడ టీడీపీలో కనిపిస్తోంది.

పొసగకపోతే పరిస్థితేంటి?
ఇప్పటికే వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నేతలకు టీడీపీ నేతలకు మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు కొత్తగా కేటాయించిన మంత్రి పదవుల విషయంలోను వైసీపీ నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం చాలామందికి మింగుడుపడటం లేదు.
ఇప్పుడు మరింత మందిని తీసుకొచ్చి పార్టీలో కూర్చోబెడితే తమ ఉనికికి ఎక్కడ ఎసరొస్తుందోనన్న ఆందోళనలో కొంతమంది టీడీపీ నేతలున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంపు ఇప్పట్లో జరగకపోవచ్చన్న సంకేతాలు కూడా వారిలో ఆందోళన పెంచుతోంది. పార్టీలో పరిమితికి మించి లోడ్ ఎక్కువైతే ఎవరికి టికెట్లు దక్కుతాయో అన్నది వారి ఆందోళన.

జగన్ యాక్షన్ లోకి దిగకపోతే?:
వరుస ఓటములతో ఢీలా పడ్డ వైసీపీ ప్రత్యర్థి పట్ల జాగరుకతతో మెదలాల్సిన సందర్భమిది. కానీ ఆ పార్టీలో అదేమి కనిపించడం లేదు. మున్ముందు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పార్టీ నుంచి ఒకే పెట్టున నేతలంతా టీడీపీలో దూకినా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇప్పటికైనా జగన్.. తమ పార్టీ నేతలను అప్రమత్తం చేస్తారో లేదో చూడాలి. ఒకవేళ జగన్ తక్షణం యాక్షన్ లోకి దిగకపోతే గనుక వైసీపీకి సమీప భవిష్యత్తులో బిగ్ డ్యామేజీ తప్పదు. ఆ ఎఫెక్ట్ 2019ఎన్నికలను కూడా వెంటాడుతుందనడంలో అతిశయోక్తి లేదు.












Click it and Unblock the Notifications