వారిద్దరికీ ఫోన్ చేశా, ప్రభాస్కు చేయలేకపోయా: బాహుబలికి చంద్రబాబు ఫిదా
బాహుబలి సినిమాకు చంద్రబాబు ఫిదా అయ్యారు. రాజమౌళి, రానాకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రభాస్కు చేయలేకపోయానని చెప్పారు.
విజయవాడ: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 సినిమాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూశారు. ఆ సినిమాకు ఆయన ఫిదా అయిపోయినట్లే ఉన్నారు. సినిమా చాలా బాగుందని ఆయన అన్నారు. ప్రపంచ స్థాయి సినిమా తీసిన రాజమౌళి రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం కితాబిచ్చారు.
రాజమౌళితో పాటు బాహుబలి జట్టును అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఇంత అద్భుతమైన సినిమాను ఆస్కార్కు పంపాలని కేంద్రానికి సిఫార్సు చేస్తున్నానని ఆయన చెప్పారు. రాజమౌళి బృందాన్ని పిలిచి రాష్ట్ర ప్రభుత్వం తరపున త్వరలోనే సన్మానిస్తామని కూడా చెప్పారు.
ప్రభాస్కు చేయలేకపోయా...
రాజమళికి, రానాకు ఫోన్ చేసి అభినందించానని, ప్రభాస్ ఫారిన్ వెళ్లాడు కాబట్టి ఫోన్ చేయడం కుదరలేదని చంద్రబాబు చెప్పారు. కళాతపస్వి కే విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం చాలా సంతోషమని చంద్రబాబు చెప్పారు.
మంత్రివర్గం కూడా..
బాహుబలి సినిమాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అభినందనలు తెలిపింది. సినిమాను అద్భుతంగా తీసిన రాజమౌళిని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తాను సినిమా చూశానని అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.
తెలుగుసినిమాకు ఓ చరిత్ర
తెలుగు సినిమాకు విశ్వనాథ్ చరిత్ర అని సీఎం అన్నారు. విశ్వనాథ్తో ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలిపానని చెప్పారు. తెలుగు సినీ దర్శకుడు విశ్వనాథ్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించిన విషయం తెలిసిందే. ఆయనను పలువురు ఇప్పటికే అభినందించారు.
బాహుబాలి - 2
బాహుబాలి - 2 సినిమాను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా ప్రశంసించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయితే మందీమార్బలాన్ని వెంటబెట్టుకుని వెళ్లి బాహుబలి సినిమా చూశారు. ఎక్కువ ధరకు టికెట్లు కొని ఆయన మరీ సినిమా చూశారు.