హుధుద్ కోసం 'మేము సైతం': సినిమా ఇండస్ట్రీపై చంద్రబాబు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుసినీ పరిశ్రమ నిర్వహిస్తున్న మేము సైతం కార్యక్రమం పైన ఆదివారం ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. హుధుద్ తుఫాను బాధితులకు సాయం చేయాలన్ని ప్రయత్నం మంచిదన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో గొప్పదనం అభిమానుల కష్టంలో అంతా ఏకతాటిపై నిలవడమేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన విశాఖపై హుధుద్ తుఫాను నేపథ్యంలో నిధులు సమకూర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం హర్షనీయమన్నారు. బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
కాగా, హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ మేము సైతం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఆదివారం జరుగుతున్న ఈ కార్యక్రమం యావత్ తెలుగు ప్రజలను అలరిస్తోంది.
మేము సైతం కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణ పాట పాడి అలరించారు. ఆయన రెండు పాటలు పాడారు. గాయని కౌసల్యతో ఓ పాట, మాళవికతో కలిసి ఓ పాట పాడారు. విజిల్స్ వేసి ఉత్సాహపరిచారు. తెలుగు టాప్ హీరో మహేష్ బాబును కథానాయిక సమంత ఇంటర్వ్యూ చేశారు. సమంత అడిగిన ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు.
మీ సినిమాలు హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని సమంతా పొగిడారు. దానిపై మహేష్ మాట్లాడుతూ.. ఇలాంటి మాటలు వినే హీరోలు షెడ్డుకు వెళ్లిపోతున్నారన్నారు. తను తెలుగు సినిమాల టెక్నాలజి స్థాయిని పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. తన సినిమాల్లో ఒక్కడు, అతడు, పోకిరి ఇష్టమని వివరించాడు. ఇటీవల విజయ్ నటించిన తమిళ సినిమా 'కత్తి' చూశానని, అయితే తానూ రీమేక్ చిత్రాలు చేయనన్నారు.
సింపుల్గా ఉండటంలో టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ బాబు, పవన్ కల్యాణ్.. ఇద్దరూ ఒకేలా ఉంటారని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. మహేష్, పవన్ కల్యాణ్లు చాల సహజంగా నటించే గుణాలు ఉన్న వారని, ఎంతో కలసిపోతారన్నారు. అందువల్లనే వీరిద్దరితో కలసి రెండేసి సినిమాలు చేయగలిగానని తెలిపారు.
అనంతరం త్రివిక్రమ్ మాట్లాడుతూ.. సినిమాను విపరీతంగా అభిమానించే ఉత్తరాంధ్ర ప్రజలకు హుధుద్ రూపంలో కష్టం రావడం దురదృష్టకరమన్నారు. తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ఏకతాటి పైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని తెలిపారు.