నాకు భయమా? మన మేలు కోసమే పవన్, జగన్ మాత్రం..: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని అసంతృప్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. గురువారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.
Recommended Video
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడంలో రాజీ లేదని చంద్రాబాబు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపైనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బోడిగుండుకు సన్మానాలా?, 'జగన్-హోదా; ప్యాకేజీ-పప్పు': గల్లా, లోకేష్పై రోజా తీవ్ర వ్యాఖ్యలు
పవన్ పోరాటంలో అర్థముంది
పవన్ కళ్యాణ్ పోరాటంలో అర్థముందని చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రానికి మేలు చేయాలని పవన్ ముందుకెళ్తున్నారని చెప్పారు. తమ ఉద్దేశ్యమూ రాష్ట్ర ప్రయోజనాలేనని అన్నారు.
పవన్కు సున్నితంగానే..
పవన్ జేఎఫ్సీ తమకు ఇబ్బంది లేదని చంద్రబాబు అన్నారు. శ్వేత పత్రం అడిగితే సున్నితంగా సమాధానం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు, నేతలకు బాబు సూచించారు. బాబు చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ను మిత్రపక్షంగానే చూడాలని సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీ లెక్కలు చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వానికి లెక్కలు ఇచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు తెలిపారు. కేంద్రం ఏం చేసిందో బీజేపీ శ్వేత పత్రం ఇవ్వాలని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఏం మంజూరు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్లు ఏపీకి కూడా ఇచ్చారని, విభజన హామీల అమలుకు ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు జరగలేదని చంద్రబాబు అన్నారు.29సార్లు ఢిల్లీ వెళ్లినా బడ్జెట్లో మనకు మళ్లీ అన్యాయం చేశారని.., హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటం కొనసాగించాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలుగుదేశం క్రమశిక్షణ కలిగిన పార్టీ అని గుర్తు చేసిన చంద్రబాబు... అనవసరంగా ఎప్పుడూ ఒకరిని నిందించబోమన్నారు.
జగన్ ఏది చేసినా..
మన రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం చేద్దామని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ను ప్రకటిస్తారని తమకు తెలియకముందే జగన్ ఆయనతో ఫొటోలు దిగారని అన్నారు. అడగకుండానే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులకు జగన్ మద్దతు ప్రకటించారని అన్నారు. జగన్ ఏం చేసిన కేసుల మాఫీ, లాలూచీ కోసమేనని చంద్రబాబు అన్నారు.
కేసులంటే భయమా?
తానేదో కేసులకు భయపడుతున్నానని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. తాను కేసులకు భయపడతానా? కేసులంటే తమకెందుకు భయం? అని చంద్రబాబు అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా క్లీన్ చిట్ వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలూ కేసులకు భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.