ప్రతి ఒక్కరూ బాహుబలి కావాలి: అమెరికాలో రాజమౌళిని ఆకాశానికెత్తేసిన బాబు
తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.
న్యూయార్క్: తెలుగువారు ఒక్కొక్కరు ఒక్కో బాహుబలి కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గత మూడ్రోజుల నుంచి అమెరికాలో పర్యటనలో ఉన్న చంద్రబాబు.. ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారున్నారని, ప్రతిభ, నైపుణ్యంతో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి కష్టపడే తత్వం ఎక్కువని, వారు ఎక్కడైనా రాణించగలరని అన్నారు.
రాజమౌళి సత్తా చాటారు
తెలుగు బిడ్డ రాజమౌళి ‘బాహుబలి' చిత్రం చూస్తే తెలుగువారి, తెలుగు సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు. బాహుబలి సినిమా చూడకపోతే ఏదో తప్పు చేశామన్న భావన అందరిలోనూ కలిగిందన్నారు. అదీ తెలుగువాడి సత్తా అని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఉంటున్న తెలుగువారు.. పుట్టిన ఊరును మర్చిపోవద్దని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసులు తమవంతుగా పాలుపంచుకోవాలన్నారు. కొత్తగా ఆలోచించి ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయాలని, ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అమెరికాలో ఉండే ప్రజలతో మమేకమైతే మనకు తిరుగుండదని అన్నారు.
వరుస భేటీలు..
అమెరికాలో నాలుగో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. స్థానికంగా ఉన్న ఐయోవా స్టేట్ యూనివర్సిటీలో సీడ్ సైన్స్ సెంటర్ను ఆయన సందర్శించారు. మెగా సీడ్ ప్రాజెక్టు తొలిదశకు అంకురార్పణ జరిగింది. అనంతరం పరిశోధన క్షేత్రాన్ని కూడా బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వచ్చే అక్టోబర్ నుంచే ప్రాజెక్టు ప్రభావం కనిపించాలని సూచించారు. కాగా, విత్తనోత్పత్తి, వ్యవసాయ పరిశోధనలో ఐయోవా స్టేట్ యూనివర్సిటీ ఏపీకి సహకారం అందించనుంది.
కార్యక్రమాలతో బిజీగా..
అనంతరం చంద్రబాబును కాలిఫోర్నియాకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కలిశారు. చంద్రబాబును కలిసినవారిలో శాన్హోజ్ మేయర్ సామ్లికార్డో, కాంగ్రెస్ ప్రతినిధి రో ఖన్నా, సెనేటర్ బాబ్ వెల్సీ కౌస్కీ, అసెంబ్లీ సభ్యులు కాన్సాన్ చు, ఆఫ్ కల్రా ఉన్నారు. రాజకీయ ప్రముఖులు కలిసినంక శాన్హోజ్లో ప్రవాసాంధ్రులతో చంద్రబాబు సమావేశమయ్యారు.
కష్టపడే తత్వం మనది..
తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతికి కష్టపడే తత్వం ఉంది..ఎక్కడైనా పనిచేయగలరని, దర్శకుడు రాజమౌళిని చూస్తే తెలుగువాడి సత్తా తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాహుబలి కావాలని, ప్రవాసాంధ్రులతో చంద్రబాబు, స్థానికులతో ప్రవాసాంధ్రులు మమేకం కావాలని ముఖ్యమంత్రి కోరారు.
కాలిఫోర్నియాతోనే పోటీ.. ఏపీకి వరమది..
బిల్గేట్స్ను ఒప్పించి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ వచ్చేలా కృషిచేశానన్నారు. నిజాం చార్మినార్ నిర్మిస్తే.. ఎన్టీఆర్ బుద్ధుడి విగ్రహం పెట్టించారన్నారు. తెలుగు రాష్ట్రానికి చరిత్రలో కొన్ని ఇబ్బందులు వచ్చాయని, రాజధానులు మారుతూ వచ్చామని ఆయన ప్రవాసాంధ్రులతో అన్నారు. తనకు రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం వచ్చిందని, 2050 నాటికి కాలిఫోర్నియాతో అమరావతి పోటీపడుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అపారమైన సహజసంపద ఏపీకి వరమని, రాజధాని నిర్మాణానికి ప్రవాసాంధ్రులు సహకరించాలని సీఎం వారిని కోరారు.