వెంకయ్యను మెచ్చుకుంటున్నా: బాబు, ఎన్టీఆర్ గ్రేట్: వెంకయ్య, రిషికేశ్వరి మృతిపై..
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు పరస్పరం ప్రశంసలు కురిపించుకున్నారు. తొలుత వెంకయ్య, ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడారు.
వెంకయ్య ఢిల్లీలో ఉన్నంత వరకు...
వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నంత వరకు ఏపీకి అన్యాయం జరగదని తనకు నమ్మకం ఉందని చంద్రబాబు అన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య పోరాటం అద్భుతమన్నారు. లోకసభలో ఇష్టానుసారంగా విభజన బిల్లు పాస్ చేశారని, అలాంటి పరిస్థితుల్లో రాజ్యసభలో వెంకయ్య అభిమన్యుడిలా పోరాడారన్నారు. ప్రత్యేక హోదా సహా పలు హామీలు వెంకయ్య పోరాటం వల్లే వచ్చాయన్నారు.
చంద్రబాబు సవాళ్లు ఎదుర్కోగలరు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికత గల నేత, శక్తిసామర్థ్యాలు, క్రమశిక్షణ ఉన్న నాయకుడు అని వెంకయ్య అన్నారు. ఏపీలో చంద్రబాబు ఎన్నిక గర్వకారణమన్నారు. క్లిష్ట సమయాల్లో ఆయనకు సవాళ్లను ఎదుర్కోగలిగే శక్తి ఉందన్నారు.
ఎన్టీఆర్ పైనా..
స్వర్గీయ నందమూరి తారక రామారావు మడమ తిప్పని నేత అని, ఆయన గురించి ప్రపంచానికి చాటి చెప్పాలని వెంకయ్య నాయుడు అన్నారు.
ర్యాగింగ్పై హితవు.. గంటా ఓకే
ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే సమాజానికి చెడ్డ పేరు అని, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకోవడం విషాదమని, ఆత్మహత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని వెంకయ్య సూచించారు. ర్యాగింగ్ అనేది అసభ్యత, అనాగరికం అన్నారు. ర్యాగింగ్ రూపుమాపేందుకు నిర్భయ తరహా చట్టం తేవాలన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఆయన స్పందించారు.
వెంకయ్య సూచనపై గంటా మాట్లాడుతూ... ర్యాగింగ్ విషయం సీరియస్గా తీసుకుంటామని చెప్పారు. నిర్భయ చట్టాన్ని పరిశీలిస్తామన్నారు. ర్యాగింగ్కు పాల్పడితే భవిష్యత్తులో కూడ చదవకుండా చేస్తామని, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కాంగ్రెస్ పార్టీపై వెంకయ్య సెటైర్లు
కాంగ్రెస్ పార్టీ పైన వెంకయ్య తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రధాని మోడీని టూరిస్ట్ ప్రధాని అంటున్నారని, మరి మీలా బావిలో కప్పలా ఉండాలా అన్నారు.
ఏడాదిలో ఏపీకి ఏం చేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని, మరి యాభై ఏళ్లుగా వారేం చేశారన్నారు. యాబై ఏళ్లు భారత్కు వృథా అయిందని, ఇప్పుడు అసలైన నాయకత్వం వచ్చిందన్నారు.
అధికారం లేకుంటే చేప గిలగిలా కొట్టుకుంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలాగే ఉందన్నారు. అధికారం పోయాక కాంగ్రెస్ చేపలా కొట్టుకుంటోందన్నారు.
ప్రపంచం మోడీకి జేజేలు పలుకుతోందని, కానీ విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు.
నిత్యం పంచాలి... పంచాలి అంటున్నారని, కానీ పెంచకుండా ఎలా పంచుతారని, మోడీ దాని కోసమే ప్రయత్నిస్తున్నారన్నారు.
విభజన తర్వాత ఎన్నో సమస్యలు: చంద్రబాబు
విభజన జరిగాక ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. రాజధాని లేకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందన్నారు. ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు రగిలించారన్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరాని చాలాసార్లు వచ్చారని, ఇంకా వస్తారన్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా చేస్తామన్నారు.
ఏపీని ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు కేంద్రం సహకారం అవసరమన్నారు. ఇందుకోసం స్మృతి మరిన్నిసార్లు వస్తారన్నారు. నా అశలన్నీ విద్యార్థుల పైనే అని చెప్పారు. టిడిపి ఎంపీలు రావాల్సిన హామీల పైన ప్రయత్నాలు చేస్తోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను చట్టంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకే వదిలేసిందని, ఆ తర్వాత ఎన్డీయే ఆర్డినెన్స్ తీసుకు వచ్చి ఏడు మండలాలు మనకు ఇచ్చారన్నారు. దీంతో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతోందన్నారు.
హైదరాబాదును అన్ని రకాలుగా అభివృద్ధి చేశామన్నారు. ఈ జిల్లాకు చెందిన పలువురు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టారన్నారు. ఇప్పుడు మనం అభివృద్ధి సాధించాల్సి ఉందన్నారు. కేంద్రం సహకరిస్తుందన్నారు. ఏపీని నెంబర్ వన్గా చేసే వరకు నిద్రపోవద్దన్నారు.
అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా చేస్తే నేను సహకరిస్తానని ప్రధాని మోడీ చెప్పారన్నారు. వివిధ రాజధానులు చూడాలని తనకు సూచించారన్నారు. ఇబ్బందులను అధిగమించే శక్తి మనకు ఉందన్నారు. కేంద్రం పని తనం మనం చూస్తున్నామన్నారు.
వెంకయ్య, స్మృతి ఇరాని.. ఇతర కేంద్రమంత్రులు వారి చేతుల్లో ఉన్న పనులు మనకు చేస్తున్నారన్నారు. ఏపీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో ఉందన్నారు. పక్కన తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలున్నాయని, వాటిలా ఏపీ పైకి వచ్చే వరకు సహసరించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.
మోడీ దేశ ప్రతిష్టను పెంచారు
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రతిష్టను పెంచారన్నారు. లక్షలమంది ఇళ్లకు టాయిలెట్లు కట్టడం ఎన్డీయే సాధించిన విజయం అన్నారు. తాము టాయిలెట్ల నిర్వహణకు డ్వాక్రా సంఘాలకు ఇస్తామని చెప్పారు. మన పిల్లలు మట్టిలో మాణిక్యాలు అని, వారు ప్రపంచాన్ని శాసించగలరన్నారు.
అనంత ముద్దుబిడ్డ సత్య నాదేళ్ల మైక్రోసాఫ్టు కంపెనీ అధినేతగా ఎదిగారని, ఇంద్రానూయి పెప్సికో కంపెనీ చీఫ్గా ఉన్నారని, తమిళనాడు వాసి సుందర్ పిచాయ్ గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయికి ఎదిగారన్నారు. ఇలా ఎందరో ఉన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు ఎంత చేసినా తక్కువే అన్నారు.
ఓ ఆలోచన వస్తే ఏదైనా సాధించగలమన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విజయవాడకు చెందిన జాగర్లమూడి శ్రియను ప్రస్తావించారు. ప్రధాని మోడీ పిల్లల ఆలోచన శక్తిని గుర్తించారన్నారు. 2022 నాటికి ఏపీ మూడు అగ్రరాష్ట్రాల్లో ఒకటిగా, 2029నాటికి నెంబర్ వన్ గా ఉంటుందన్నారు. 2050కి ప్రపంచంలోనే అగ్ర స్థానం సాధిస్తుందన్నారు.
రాయలసీమకు నీళ్లు తీసుకుపోయేందుకు పట్టిసీమ ప్రాజెక్టు కడతామంటే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు తనను అర్థం చేసుకున్నారన్నారు. ఈ రోజు పట్టిసీమ, పోలవరం ఓ చరిత్ర అన్నారు. పట్టిసీమపై వైసిపి, కాంగ్రెస్ రాజకీయం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. వెంకయ్య తన శాఖ నుంచి భారీగా నిధులు ఇచ్చారన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాకు రుణపడి ఉంటానని, ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామన్నారు. భూమిని కొని అయినా తాడేపల్లిగూడెంలో నిట్ ఏర్పాటు చేయాలనుకున్నామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకారంతో ముందుకెళ్తామని చెప్పారు.
విభజన తర్వాత అనేక ఇబ్బందులు: గంటా
విభజన తర్వాత ఏపీ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ లేకుండా చేస్తామన్నారు. రాష్ట్రాన్ని విద్యా హబ్గా మారుస్తామన్నారు. ఈ నెల 30 నుంచి నిట్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు.