వెంకయ్య ఎఫెక్ట్, అటు నుంచి నరుక్కొస్తున్న బాబు!: బీజేపీపై 'ముందస్తు' ప్లాన్
పీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్ను టార్గెట్ చేద్దామనుకున్న టిడిపి.. చివరకు అదే ఇరుకున పడింది.
అమరావతి: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైసిపి అధినేత వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జగన్ను టార్గెట్ చేద్దామనుకున్న టిడిపి.. చివరకు అదే ఇరుకున పడింది.
చదవండి: అందుకే రాలేకపోతున్నా, మడమ తిప్పను.. మేం సిద్ధం: పవన్ కళ్యాణ్
ఆ తర్వాత రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. జగన్ భేటీ మొదలు, ఆ తర్వాత కేంద్రంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, తాజాగా ఈ రోజు టిడిపి ఎంపీ కేశినేని నాని బీజేపీపై విమర్శలు చూస్తుంటే రాజకీయాలు ఏ దిశగా వెళ్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంది.
నిన్న ఢిల్లీలో చంద్రబాబు అలా.. నేడు మాత్రం
మొత్తానికి టిడిపి - బిజెపి మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇరు పార్టీలు దూరమయ్యే పరిస్థితులు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్డీయే పక్షాల భేటీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు, తాజాగా జరుగుతున్న పరిణామాలకు ఏమాత్రం సంబంధం లేదు.
2019 ప్రధాని మోడీ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ఢిల్లీలో చెప్పారు. విభజన నేపథ్యంలో ఏపీకి కేంద్రం అండ అవసరమని పలుమార్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సర్దుకు పోవాల్సిన అవసరముందన్నారు. ఇదంతా జగన్ - మోడీ భేటీకి ముందు. ఆ తర్వాత మాత్రం, ఇటీవల విభజన చట్టం విషయంలో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అటు నుంచి నరుక్కొస్తున్న బాబు..
భేటీ విషయంలో మాత్రం జగన్ను తప్పుబట్టిన చంద్రబాబు.. బీజేపీ, మోడీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ భేటీ అంశంపై తొలుత మోడీని, బీజేపీని కూడా టిడిపి తప్పుబట్టింది. కానీ బీజేపీ కూడా ఎదురుదాడి చేయడంతో బీజేపీపై తగ్గింది. కేవలం జగన్ను టార్గెట్ చేస్తోంది. అయినా బీజేపీ తగ్గలేదు. జగన్ - మోడీ భేటీని తప్పుబట్టడాన్ని నిలదీస్తోంది. చంద్రబాబు భేటీ గురించి మాట్లాడకుండా విభజన చట్టం హామీల వైపు నుంచి కేంద్రం తీరును తప్పుబడుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
టిడిపితో ఉంటే ఎదగలేమనేనా?
టిడిపితో కలిసి ఉంటే ఎదిగే పరిస్థితి కనిపించడం లేదని బిజెపి నేతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే ఒంటరిగా లేక విపక్ష వైసిపితో కలిసి వెళ్తే బిజెపికి ప్రత్యేకంగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది. పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి వారు టిడిపికి దూరం జరగడమే మంచిదని భావిస్తున్నారు.
ముందస్తు జాగ్రత్తలా?
గతంలో పలు సందర్భాల్లో బిజెపితో మనస్పర్థలు వచ్చినప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు చేసేవారు. బీజేపీపై విమర్శలు చేయవద్దని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల జగన్ - మోడీ భేటీపై కూడా బిజెపి ఎదురుదాడి చేయడంతో కేవలం వైసిపినే టార్గెట్ చేయమని చెప్పారు.
కానీ, విభజన చట్టం అమలుపై చంద్రబాబు అసంతృప్తి, తర్వాత ఎంపీ కేశినేని నాని.. బీజేపీ వల్లే తనకు ఓట్లు తగ్గాయని చెప్పడం గమనార్హం. అంటే, బిజెపితో పొత్తు ఎటు తిరిగినా ముందు జాగ్రత్తలో భాగంగా కమలం పార్టీని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
వ్యూహాత్మకంగా..
చంద్రబాబు విభజన చట్టం హామీల అంశంలో కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది బిజెపిని ఇరుకున పడేయడమే. ఇక, బిజెపి వల్ల తనకు ఓట్లు తగ్గాయని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు లేకుంటే ఎక్కువ లక్షన్నర ఓట్లకు పైగా వస్తాయన్నారు. ఇది వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యగా చెప్పవచ్చు. ఇది కూడా చంద్రబాబుకు సన్నిహితుడైన వెంకయ్య నాయుడు వ్యాఖ్యల అనంతరం కేశినేని అనడం గమనార్హం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో (పొత్తు) నాని వ్యాఖ్యలను వ్యక్తిగతంగానే తీసుకుంటున్నామని, కానీ చంద్రబాబు దీనిపై తేల్చాలని బిజెపి నేతలు అంటున్నారు.
ఒకవేళ 2019 నాటికి పొత్తు కుదరకపోతే.. బిజెపి వల్ల తమకు ఎన్నికల్లో ఎలాంటి లాభం లేదని, కానీ ఏపీ ప్రయోజనాల దృష్ట్యానే తాము ఇన్నాళ్లు ఓపిక పట్టామని చెప్పేందుకు టిడిపికి ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు విభజన హామీల అసంతృప్తి, కేశినేని నాని వ్యక్తిగత వ్యాఖ్యల గూడార్థం.. ఏపీ కోసమే కలిసున్నామని, బిజెపితో తమకు వచ్చిన లాభమేం లేదని చెప్పేందుకే అంటున్నారు.
నిన్నటి దాకా జగన్.. ఇప్పుడు టిడిపి
నిన్నటి వరకు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయాలని, కేంద్రం నుంచి బయటకు రావాలని జగన్ చెప్పారు. టిడిపి మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి కేంద్రం అవసరం కాబట్టి ఢిల్లీ పెద్దలతో గొడవ సరికాదన్నారు. ఇప్పుడు జగన్ రివర్స్ గేర్ వేశారు. హోదా కోసం రాజీనామాలు ఇప్పుడు కాకుంటే మరికొన్నాళ్లకు చేద్దామని అంటున్నారు. టిడిపి హోదా అంశాన్ని ఎలాగు పక్కన పెట్టింది కాబట్టి విభజన హామీలను తెరపైకి తీసుకు వస్తున్నట్లుగా కనిపిస్తోంది.
టిడిపి- బిజెపి మధ్య తేలిపోయిందా?
బీజేపీ - టీడీపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే పొత్తు తేలిపోయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. కాబట్టి ఏం చెప్పలేని పరిస్థితి. గతంలో సెక్షన్ 8, ప్రత్యేక హోదా వంటి సమయంలో టిడిపి - బిజెపి మధ్య సంబంధాలు తెగిపోతాయని భావించారు. హోదా ఇవ్వనంటే బిజెపికి దూరం జరుగుతామని టిడిపి నేతలు చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం హోదాతో లాభం లేదని ప్యాకేజీ బెట్టర్ అని యూ టర్న్ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏం చెప్పలేం. టిడిపి కంటే బిజెపికి మాత్రం దూరం జరగాలని ఉన్నట్లుగా కనిపిస్తోంది.