2018 చివర్లో ఎన్నికలు, నంద్యాల ఫలితాలే ,టిడిపి ప్లాన్ ఇదే!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించారు. 2018 చివరినాటికి ఎన్నికలకు సిద్దంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. నంద్యాల తరహ ఫలితాలే ఈ ఎన్నికల్లో రావాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ముందస్తు ఎన్నికల గురించిమాట్లాడారు. నంద్యాల ఉపఎన్నికల ప్రచారసమయంలో ఆయన పరోక్షంగా 2018 చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు.
ముందస్తు ఎన్నికలు బాబుకు కలిసిరావా, చరిత్ర సృష్టిస్తారా?
మరోసారి అదే తరహ సంకేతాలను చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు ఇచ్చారు. కాకినాడ, నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై నిర్వహించిన వర్క్షాప్లో బాబు ఈ విషయాన్ని వివరించారు.
నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబునాయుడు అభినందించారు. ఇదే తరహ పలితాలు రానున్న ఎన్నికల్లో రావాల్సిన అవసరం ఉందని బాబు అభిప్రాయపడ్డారు.
ముందస్తు ఎన్నికలకు సిద్దం కావాలి
2018 చివరి నాటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలకు సిద్దంగా ఉండాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. ఎన్నికలకు ఇప్పటి నుండే సన్నద్దం కావాల్సిన అవసరాన్ని చంద్రబాబునాయుడు నొక్కి చెప్పారు. మోడీ కూడ ముందస్థు ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో బాబు కూడ అదే దారిలో పయనించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే చంద్రబాబునాయుడు 2018 చివరినాటికి ఎన్నికలకు సిద్దం కావాలని పార్టీ నేతలకు సంకేతాలు ఇచ్చారని సమాచారం.
నంద్యాల ఫలితాలే రావాలి
2019 ఎన్నికల్లో కూడ నంద్యాల ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రావాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహన్ని రాష్ట్రంలో అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలను సంతృప్తి పర్చేలా పాలన సాగిస్తే ప్రతి ఎన్నికల్లో విజయం సాధ్యమౌతోందని బాబు చెప్పారు.
మిషన్ 2019 పేరిట వర్క్షాప్
2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లతో మిషన్-2019 పేరిట మంగళవారం నాడు అమరావతిలో టిడిపి వర్క్షాప్ నిర్వహిస్తోంది. 2019 ఎన్నికల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఇప్పటి నుండే ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశాలపై చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు.
80 శాతం ప్రజలను తృప్తి పర్చాలి
నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ ఎన్నికల్లో ప్రజల మనోభావాలు ఏమిటనేది సీఎంకు వివరించారు ఆయా ఎన్నికల్లో పాల్గొన్న నేతలు. అయితే ప్రజల నమ్మకానికి అనుగుణంగా పార్టీ వ్యవహరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. నంద్యాలలో జరిగిన ఎన్నికల్లో 56 శాతం ఓట్లు వచ్చాయని, అది 60 శాతానికి చేరాలని సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. . 80 శాతం ప్రజలను సంతృప్తి స్థాయికి తీసుకెళ్లే చర్యలు చేపడతామని చెప్పారు. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ అందిస్తామని చెప్పారు.