ఏపీ భగ్గు: తగ్గిన చంద్రబాబు, జగన్ 'బంద్'పై సొంత పార్టీలో అసంతృప్తి
హైదరాబాద్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పైన ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో వైసిపి హోదాపై చర్చకు పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జైట్లీ ప్రకటన పైన స్పష్టత ఇవ్వనున్నారు. చంద్రబాబు బుధవారం రాత్రి చేసిన ప్రకటన పైన విమర్శలు వస్తున్నాయి. జైట్లీ ప్రకటనను స్వాగతించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీంతో తాను ఏం చెప్పానో.. అలాగే హోదా కోసం ఏం చేద్దామో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
జైట్లీ ప్రకటన పైన ఏపీ నిప్పులు చెరుగుతోంది. మంచి ఆర్థిక సాయమని చెప్పి నిండా ముంచారని మండిపడుతున్నారు. నిన్న సాయంత్రం దాకా హోదాను మించిన సాయమని చెప్పారని తీరా చెవిలో పువ్వులు పెట్టారని ధ్వజమెత్తారు.
ఇద్దరు కూనీ చేశారు, బాబు ఒప్పుకునేదేంటి: ఎల్లుండి బంద్కు జగన్ పిలుపు
విశాఖ, తిరుపతి, విజయవాడ, గుంటూరు తదితర అన్ని చోట్ల కేంద్రం తీరు పైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వైసిపి, వామపక్షాలు ఎల్లుండి బందుకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు.
బంద్పై వైసిపిలో భిన్నాభిప్రాయాలు
ఎల్లుండి (శనివారం) నాటి బంద్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ హోదా విషయమై ఎల్లుండి బందుకు పిలుపునిచ్చారు. అయితే, ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలతో పాటు రెండో శనివారం కావున బంద్ సరికాదని పలువురు వైసిపి ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. మరో రోజు పెట్టుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.
విశాఖ బదులు బెజవాడ: రైల్వేజోన్పై కేంద్రం మెలిక, అందుకే!
జీఎంసీ వద్ద టిడిపి ఎంపి అవంతి దీక్ష
విశాఖపట్నం జీఎంసీ వద్ద తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ దీక్షకు దిగారు. విశాఖకు రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం దిగి రావాలన్నారు. కాగా, రైల్వే జోన్.. విశాఖ బదులు విజయవాడకు ఇవ్వాలని కేంద్రం చూస్తోంది. దీంతో విమర్సలు వస్తున్నాయి.
శాసన మండలి నుంచి ప్రతిపక్షాల వాకౌట్
శాసన సభతో పాటు శాసన మండలిలోను ప్రత్యేక హోదా వేడి కనిపించింది. చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, దానిని ఏపీకి ఎందుకివ్వరని కాంగ్రెస్ సభ్యుడు సీ రామచంద్రయ్య ప్రశ్నించారు. దీనిపై మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటన చేస్తుందని చెప్పారు.