ఓ నేరస్తుడి వల్లే, 'సాక్షి'కే ఎలా తెల్సింది: ఊగిపోయిన బాబు, పవన్ కళ్యాణ్కు జవాబు
విజయవాడ: కాపు గర్జన, తునిలో విధ్వంసంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో లేని సమస్యను తీసుకు వచ్చారని ముద్రగడ పద్మనాభం పైన మండిపడ్డారు.
తుని ఘటనలో 25 వాహనాలు దగ్ధమయ్యాయని చెప్పారు. 15 మంది పోలీసులు, ఐదుగురు రైల్వే సిబ్బంది గాయపడ్డారన్నారు. తుని ఘటన దురదృష్టకరమని చెప్పారు. గతంలో ఇచ్చిన జీవోలలో రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశ్యమే లేదన్నారు. జీవో 30 అమలులో ఉందన్నారు.
వైయస్ హయాంలో ఏం చేశారు.. జగన్ కమిటీ అన్నారు
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాపులను బీసీలలో ఎందుకు చేర్చలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే వారికి రూ.100 కోట్లు కేటాయించామన్నారు. నేను అధికారంలోకి వచ్చి 20 నెలలు అయిందని, మరి కాంగ్రెస్ పార్టీ 23 ఏళ్లుగా ఏం చేసిందని ప్రశ్నించారు.
తాము కాపులను బిసిల్లో చేర్చేందుకు కాలపరిమితితో కూడిన కమిటీ వేశామని చెప్పారు. కమిషన్ సూచనల ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామన్నారు. కాపుల్లో చాలామంది వెనుకబడి ఉన్నారని, వారికి న్యాయం చేస్తామన్నారు. వైసిపి కూడా తమ మేనిఫెస్టోలో కాపుల కోసం కమిషన్ వేస్తామని చెప్పిందన్నారు.
ఏడు రాష్ట్రాలలో జాట్లకు రిజర్వేషన్లు కల్పిస్తే సుప్రీం కోర్టు కొట్టి వేసిందన్నారు. పద్ధతి లేని రిజర్వేషన్లు కోర్టులో నిలబడవని అభిప్రాయపడ్డారు. ఎన్నో ఛార్జీషీట్లలో నిందుతుడిగా ఉన్న వ్యక్తి ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం దారుణమన్నారు.
సాక్షి పత్రికకే ఎలా సమాచారం వచ్చింది
సంఘటన జరుగుతుందని కేవలం సాక్షి మీడియాకే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. నాలుగైదు ఓబీ వ్యాన్లు పెట్టుకొని ఎలా ఉన్నారని ప్రశ్నించారు. రైలులో నుంచి జనాలు బయటకు రాకుంటే ఎంతమంది చనిపోయేవారని మండిపడ్డారు. ఇలాంటి అఘాయిత్యాలు చేయడమేమిటి, దానిని సమర్థించుకోవడం ఏమిటన్నారు.
ఇదేనా మన నాగరిగత అన్నారు. పోలీసులకు ఘటనతో ఏం సంబంధమన్నారు. ఇంత దారుణం ఎలా చేస్తారన్నారు. అది వ్యూహాత్మకంగా చేసిన దాడి అన్నారు. కాపు ముసుగులో కొందరు దాడి చేశారన్నారు. మేం కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చంద్రబాబు చెప్పారు.
కాపులకు చెడ్డపేరు తెచ్చేందుకే
కాపులకు చెడ్డ పేరు తెచ్చేందుకు ఈ దాడి చేశారని తాను చెప్పానని చంద్రబాబు అన్నారు. కాపు రిజర్వేషన్ పేరుతో నేరస్తులు ఒకచోటకు చేరారని ఆరోపించారు. కాపులకు న్యాయం చేయాలని నేను అధికారంలోకి వచ్చాకే కమిషన్ వేశానని, 9 నెలల కాలపరిమితి పెట్టానని చెప్పారు.
తునిలో ముందస్తు సమాచారం లేకుండా సాక్షి మీడియా డిఎస్ఎన్జీ వాహనాలు ఎలా పెట్టారో చెప్పాలన్నారు. ఓ నేరస్తుడి వల్ల ప్రశాంతంగా ఉండే జిల్లాలో దుర్ఘటన జరిగిందన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి నష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
కాపులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. నేను ఎందుకు కష్టపడుతున్నానో అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ ముసుగులో ఏం చేసినా చెల్లుతుందని వారు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం అంటే పులివెందుల నుంచి రౌడీలను పంపించి లూటీలు చేస్తే ఊరుకోదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.
నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి దానిని కచ్చితంగా అమలు చేస్తానని చెప్పారు. సభా నిర్వాహకులు కోరినన్ని బస్సులు తాము ఇచ్చామని చెప్పారు. కాపులకు రిజర్వేషన్ ఎంత ఇవ్వాలన్నా కమిషన్ నివేదిక అవసరమని చెప్పారు. దీనిపైన చర్చ జరగాలన్నారు.
అవసరమైతే జీవోలన్నింటి పైన శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. జీవో నెంబర్ 30 ఏం చెబుతుంది, కోర్టులు ఏం చెబుతాయి.. అనే వాటిపై చర్చ జరగాలన్నారు. తప్పుడు జీవోల వల్ల కాపులకు న్యాయం జరగదని చెప్పారు. అది పక్కాగా ప్లాన్ చేసిందనే అర్థమవుతోందనే అంటున్నారు.
గోదావరి జిల్లా వారికి దాడుల అలవాటులేదు
తుని ఘటన రౌడీ మూకలు చేసే పనులు తప్ప గోదావరి జిల్లాలకు చెందిన వారు చేయరన్నారు. ఇలాంటి లూటీలు, దాడులు కొంతమంది మాత్రమే చేస్తారన్నారు. అది వారికి అలవాటు అన్నారు. సమాజంలో రెండే కులాలు ఉన్నాయని తాను భావిస్తానని ఒకటి పేదలు, రెండు ధనికులు అన్నారు. హింస సృష్టించాలనే బయటి వ్యక్తులు గోదావరి జిల్లాలకు వెళ్లారన్నారు.
వైయస్ కాపులకు ఏం చేయలేదు, నేను చేస్తున్నా
చిత్తశుద్ధి లేకపోవడం వల్లే వైయస్ రాజశేఖర రెడ్డికాపులకు ఏం చేయలేదన్నారు. కాపులంటే నాకు గౌరవం ఉందని, అందుకే కమిటీ వేశానని చెప్పారు. తాము వేసిన కమిషన్ ఆధారంగా జీవో విడుదల చేస్తే చట్టబద్ధ వస్తుందని చెప్పారు. నాకు ఎవరో చెబితే కాపు అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చలేదన్నారు.
నిరాధారపూరితంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజలు తమకు ఓటు వేశారని, బాధ్యత తమకే ఎక్కువ ఉందని చెప్పారు. నేను కాపులలో ఉండే పెద్దలను, యువతను కోరుతున్నానని, విజ్ఞతతో ఆలోచించాలన్నారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడారు...
ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారని, అందరూ అదే అడుగుతున్నారని, తుని ఘటన ఎందుకు చేశారని ప్రశ్నించారని అన్నారు. కాపులకు ఏం చేయాలో అంతా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. గోదావరి జిల్లాలు, విశాఖలు తన పార్టీకి ఆశీస్సులు అందించాయన్నారు.
నీ వద్ద అవినీతి డబ్బు ఉందని, వెదజల్లి ఇష్టారీతిన చేస్తానంటే ఎలా అన్నారు. దౌర్జన్యం చేయడం ఏమిటన్నారు. ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం దిశగా ఆలోచిస్తామన్నారు. ఏది మంచిదనేది ప్రజలు అంతిమంగా నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రజలు ఆలోచించాలని చెబుతున్నానన్నారు.
23 నెలలు ఓపిక పట్టిన వాళ్లు కనీసం తొమ్మిది నెలలు ఓపిక పట్టలేరా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమేనని కానీ, ఎక్కువ మంది పోలీసులను పెడితే వారిని కూడా కొడితే ఎలా ఉండేదన్నారు. అంతమంది జనాలు ఉన్నప్పుడు కష్టమే అన్నారు.
లక్షలమంది వచ్చినప్పుడు ముందస్తుగా చర్యలు ఎందుకు తీసుకోలేదని పవన్ ప్రశ్నించిన విషయం తెలిసిందే. కాపులు కూడా తమకు ఓట్లు వేశారని, అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తన పైన ఉందని చెప్పారు. పట్టిసీమ వస్తే గోదావరి జిల్లాలకు నీళ్లు ఉండవని అభూత కల్పనలు ప్రచారం చేశారన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేశారన్నారు. నేరస్తుడి ట్రాప్లో ప్రజలు పడొద్దన్నారు. కులం, మతం ప్రాంతాలు చాలా ప్రమాదమైనవన్నారు. కులాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. అన్ని మతాలను గౌరవించాలని, కానీ మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడవద్దన్నారు.
మొన్నటి వరకు హైదరాబాద్
మొన్నటి వరకు హైదరాబాద్ ఉందని, ఇప్పుడు మనకు తీర ప్రాంతం ఉందని చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
మేం రాష్ట్ర అభివృద్ధికి ఆలోచిస్తుంటే.. ఒకాయన వెళ్లి రాయలసీమకు అన్యాయమని అంటారని, మరొకరు మరొకటి అంటారన్నారు. 50 సంవత్సరాలలో చేయని పనులు మేం ఇప్పుడు చేశాం, చేస్తున్నామన్నారు. కులం, మతం, ప్రాంతం, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందో చర్చ జరగాలన్నారు.