ఇప్పటికైనా ఆ పని చేయండి, ఇంత జరిగినా మీరిలా!, నా ప్రకటనే ఆదేశం : బాబు నిప్పులు
బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
విజయవాడ: కృష్ణా నదిలో బోటు ప్రమాదంపై అధికారుల అలసత్వాన్ని సీఎం చంద్రబాబు చీల్చి చెండాడారు. ఇంత ప్రమాదం జరిగినా.. అధికారుల్లో మాత్రం ఆ స్థాయి స్పందన కరువైందని ఆయన వాపోయారు.
Recommended Video
తాను చెప్పేదాకా అధికారుల్లో చలనం లేకుండా పోయిందని, కనీసం దీనిపై ఓ రివ్యూ మీటింగ్ అయినా పెట్టుకుని చర్చించారా? అంటూ కడిగిపారేశారు. మరోసారి తనతో చెప్పించుకునే పరిస్థితి రావద్దని, ఇప్పటికైనా అధికారులు ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తించాలని క్లాస్ పీకారు.
తదుపరి చర్యలేవి:
బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వివరాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వారికి అన్నివిధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి దీనిపై ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని చంద్రబాబు వారిని ప్రశ్నించారు. దీనికి అధికారుల నుంచి సమాధానం లేకుండా పోవడంతో ఆయన సీరియస్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
తక్షణ స్పందనేది:
22మంది చనిపోతే.. తదుపరి ఏం చేయాలన్న స్పందన మీలో ఎందుకు కరువైంది? అని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తక్షణం మీలో స్పందన కనిపించాలని ఆదేశించారు. మరోసారి తాను పిలిచి చెప్పేవరకు చూడవద్దన్నారు. తన ప్రకటననే ఆదేశంగా తీసుకోవాలని, అంతే తప్ప ఎవరికి వారు ఇదేదో తమ పని కాదన్నట్టు వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. మీ అందరి పని కూడా నేనే చేయాలా? మీకెవరికీ బాధ్యత లేదా? అంటూ మండిపడ్డారు.
ప్లీజ్ నచ్చజెప్పండి: నారాయణకు అఖిల ఫోన్, 'భ్రమల్లో పెట్టి ఇదా మీరు చేసేది?'
ఇప్పటికైనా ఆ పని చేయండి:
అనుమతులు లేని బోటులు నదిలో తిరగడంపై చంద్రబాబు అధికారులను నిలదీశారు. బోటు నడపడానికి పర్యాటక శాఖ, జల వనరుల శాఖ, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ వంటి ఐదారు శాఖలు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అందరూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ పరిస్థితి ఎందుకు వచ్చేదని ప్రశ్నించారు. 'ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులంతా ఓ రివ్యూ మీటింగ్ పెట్టండి. తప్పు ఒప్పుల గురించి చర్చించండి. నిబంధనల్లో మార్పులు చేయాలా? అన్న అంశాలను పరిశీలించండి' అంటూ చెప్పుకొచ్చారు.
నివేదిక కాదు, మీరే రావాలి:
సీఎం ఆదేశాలకు ఉన్నతాధికారులు ఓకె చెప్పారు. సమావేశం ఏర్పాటు చేసిన ఒక నివేదిక అందిస్తామని సీఎంతో తెలిపారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదు. నివేదిక అందించడం కాదు, మీరే వచ్చి నిర్ణయాలు చెప్పాలన్నారు. ఏం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారో తనకు వివరించాలన్నారు. మొత్తం మీద సీఎం ఆదేశాలతో సంబంధిత అధికారులంతా ఓ సమావేశం నిర్వహించిన బోటు ప్రమాదంపై చర్చించారు.