చెప్పండి, తీసుకుంటే తప్పేంటి: పవన్ కళ్యాణ్-జగన్లకు చంద్రబాబు ప్రశ్న
అమరావతి: ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలన్నింటిని ప్యాకేజీతో ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు తీసుకుంటే తప్పేమిటని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసిపిని, మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పరోక్షంగా ప్రశ్నించారు. పరిపాలనా నగరానికి శంకుస్థాపన అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
హైదరాబాద్ తర్వాత అమరావతి, బాబుకు ఛాన్స్, ఒంటరిని చేయం: జైట్లీ
మనకు హైదరాబాదులో పదేళ్లు ఉండే అవకాశమున్నా, ఇక్కడ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో తరలి వచ్చామని చెప్పారు. విభజన సమయంలో మనకు అన్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్ చేసిన పనితో మనం కట్టుబట్టలతో హైదరాబాద్ వీడే పరిస్థితి వచ్చిందన్నారు.
పూర్తి అప్పులతో, కట్టుబట్టలతో వచ్చామని చెప్పారు. అయితే ఆత్మస్థైర్యం వీడలేదన్నారు. ఆ రోజు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు ఎంపీలే మనకు రాజ్యసభలో ఉన్నారని, వారు గట్టిగా ఏపీ ప్రయోజనాల కోసం పోరాడారని చెప్పారు. అప్పుడు జైట్లీ, వెంకయ్య ముందుకు వచ్చారని, హోదా కోసం పోరాడారన్నారు.
నాడు అరుణ్ జైట్లీ చేసినందువల్లే ఇప్పుడు మనం కొంత నిలదొక్కుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఏపీకి ద్రోహం చేసింది కాబట్టే, తిరిగి కోలుకోలేని స్థితిలో ప్రజలు తిప్పి కొట్టారన్నారు. నాడు కాంగ్రెస్ చేసిన ద్రోహానికి విసిగిపోయానని చెప్పారు. ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు పూర్తయితే రాజధానికి ఓ రూపు వస్తుందని చెప్పారు.
ప్రత్యేక హోదాపై..
ప్రత్యేక హోదా కోసం నాడు వెంకయ్య, జైట్లీ పోరాడారని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా హోదా ఇవ్వలేకపోతున్నామని, కానీ ప్రతి పైసా ఇస్తామని, హోదా కంటే లబ్ధి చేకూరుస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు పెట్టుకోవాలన్నారు.
విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం మనకు ఏడు ముంపు మండలాలు ఇవ్వలేదన్నారు. దానిని మోడీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. హోదా పైన వైసిపి, ఇతరులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమకు ప్రత్యేక హోదా రానప్పుడు ప్యాకేజీకి అంగీకరిస్తే తప్పేమిటని అడుగుతున్నానని అన్నారు.
మిత్రులు విమర్శిస్తున్నారు: పవన్ కళ్యాణ్, జగన్లకు వెంకయ్య చురకలు
ప్రత్యేక ప్యాకేజీకి, హోదాకు తేడా లేనప్పుడు తీసుకుంటే తప్పేమిటన్నారు. ఏపీకి కేంద్రం సహకారం అవసరమన్నారు. వీలైతే కేంద్రాన్ని ఒప్పించి, లేదంటే గట్టిగా అడిగి ఏపీకి సాయం తీసుకు వస్తామని చెప్పారు. రాష్ట్రానికి న్యాయం చేస్తామని మోడీ హామీ ఇచ్చారని చెప్పారు.
హోదా పైన కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు. హోదాతో వచ్చే అన్నింటిని ప్యాకేజీలో ఇస్తామని చెప్పారని, కాబట్టి అంగీకరించామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని, ఇది సంతోషించదగ్గ విషయం అన్నారు. తాను జైట్లీతో రాష్ట్ర సమస్యలను వివరించానని చెప్పారు. విశాఖకు రైల్వే జోన్ రావాల్సి ఉందన్నారు.
మెట్రో ప్రాజెక్టు, కడపలో స్టీల్ ప్లాంట్ రావాల్సి ఉందన్నారు. మనకు ఇంకా బోలెడు సమస్యలు ఉన్నాయని, కష్టాల్లో ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చారన్నారు. మరింత అడిగామని చెప్పారు. 2014-15కు తాము రూ.16వేల కోట్లు అడిగామని, రూ.7వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు.