బాబు గొంతు మరింత బలం పుంజుకుంటే...బిజెపి స్వరం ఇంకా బలహీనమైంది:ఎందుకిలా?
అమరావతి:టిడిపి మహానాడులో చంద్రబాబు బిజెపి అగ్రనేతలపై విరుచుకుపడిన తీరు అన్ని రాజకీయపార్టీలను విస్మపరిచిందనడంలో సందేహం లేదు. పైగా నేరుగా అమిత్ షానే లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన తీరు బిజెపితో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సైతం ఆశ్చర్యానికి గురిచేశాయని తెలుస్తోంది.
Recommended Video
ఎందుకంటే...ఎంత ఆవేశం వచ్చినా చంద్రబాబు తనలోని ఆవేశాన్ని అణుచుకునే తీరులోనే మాట్లాడతారని, అది అనేక సందర్భాల్లో చూసిఉన్న టిడిపి సీనియర్ నాయకులు...మహానాడులో చంద్రబాబు అంత నేరుగా అమిత్ షా మీద దండెత్తుతారని ఊహించలేదట. అంతేకాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై చంద్రబాబు అంత నిర్భీతిగా విమర్శల దాడి చేసిన తీరు ప్రత్యర్థిపై తమదే పైచేయి అన్న సంకేతాలను పంపిన తీరులో ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు...ఏమన్నారంటే?
విజయవాడలో జరుగుతున్న టిడిపి మహానాడు రెండో రోజు సమావేశాల్లో అమిత్ షాకు చంద్రబాబు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎపి ప్రభుత్వం యుటిలిజైషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పటానికి అసలు అమిత్ షా ఎవరన్నారు... ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడైన ఆయనకు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదన్నారు. వివరాలు తెలియకుండా అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని...ఎపి ప్రభుత్వ వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు...ఇంత సూటిగా
చంద్రబాబు సాధారణంగా ఎంతటి ఆవేశకరమైన పరిస్థితుల్లోనైనా సంయమనంతో మాట్లాడటం చేస్తారు...ఒకవేళ సందర్భాన్ని బట్టి ఆవేశపడినా మరలా తదనంతరం ప్రసంగంలో తీవ్రత తగ్గించే ధోరణి కనబరుస్తారు. అయితే మహానాడులో బిజెపిపై చంద్రబాబు విరుచుకుపడిన తీరు చూస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు ఇంత ఆవేశంగా...ఇంత బలంగా...ఇంత స్పష్టంగా...ఎవరికీ వార్నింగ్ ఇవ్వలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ప్రత్యర్థులపై విమర్శల దాడి విషయంలో మిగతా రాజకీయ నాయకుల వ్యవహార శైలి వేరు చంద్రబాబుది వేరని చెప్పుకోవచ్చు. అలాంటిది కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మీద చంద్రబాబు ఈసారి విరుచుకుపడిన తీరు...ఇన్నాళ్లు వేరు...ఇప్పుడు వేరు అనే చందంగా ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కారణం...ఏమైఉండొచ్చు
కేంద్ర ప్రభుత్వంపై...బిజెపిపై...చంద్రబాబు విరుచుకుపడటానికి కారణం తెగింపు అయినా కావొచ్చు లేదా బిజెపికి సంబంధించి ఏవైనా కొత్త పరిణామాల గురించి సమాచారం తెలిసైనా ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెగింపు విషయానికొస్తే...బిజెపితో కటీఫ్ నేపథ్యంలో ఘాటు విమర్శలు ప్రతిచర్యలకు దారితీయెచ్చనే దశ నుంచి అమీతుమీ తేల్చుకోక తప్పనిస్థితి లోకి రావడం చంద్రబాబులో ఒక విధమైన తెగింపుకి కారణమైఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. లేదా ఆంధ్రజ్యోతి ఆర్కే పేర్కొన్నట్లు ఆర్ఎస్ఎస్ బిజెపికి మోడీ-అమిత్ షాలకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్దం చేయడం గురించి ఏమైనా స్పష్టమైన సమాచారం చంద్రబాబుకు అందడం లాంటిదేదైనా జరిగితే అది కూడా వారిపై ధిక్కార స్వరం వినిపించడానికి దోహదపడుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వీటికి తోడు కర్ణాటక పరిణామాలు కూడా చంద్రబాబులో మరింత కాన్ఫిడెన్స్ పెంచిఉండొచ్చని...అందుకే చంద్రబాబు గొంతు గతంలో కంటే మరింత బలంగా వినిపిస్తోందని అంటున్నారు.
బిజెపి స్వరం...మరింత క్షీణించింది.
మరోవైపు చూస్తే అసలు బిజెపితో చంద్రబాబు తెగతెంపులు చేసుకోవడానికి ఎపి బిజెపిలోని కొందరు నేతల వైఖరే ప్రధాన కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా సోమూ వీర్రాజు టిడిపి మిత్రపక్షంగా ఉండగానే ఆ పార్టీ అవినీతి గురించి,చంద్రబాబు గురించి తీవ్రంగా ధ్వజమెత్తడం చేశారు. ఆ తరువాత ఆయనకు మాణిక్యాలరావు, అడపాదడపా విష్ణుకుమార్ రాజు లాంటి వారు గొంతు కలపడం చేశారు. అయితే ఆ తరువాత టిడిపి తప్పనిసరి పరిస్థితుల్లో బిజెపితో తెగతెంపులు చేసుకున్నాక...అంతకుముందు అది చేస్తాం ఇది చేస్తాం అన్న బిజెపి నేతలు క్రమంగా సైలెంటయిపోయిన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా సోమూ వీర్రాజైతే అసలు కనీసం స్పందించడం కూడా మానేశారు. కొత్తగా ఎపి బిజెపికి అధ్యక్షుడిగా వచ్చిన కన్నా కూడా తన స్థాయికి తగిన పోరాటం ఇంకా ప్రారంభించలేదనే చెప్పాలి. దీంతో బిజెపి నుంచి రాబోయే విపత్తు లాంటిది ఏదైనా ఉంటే దాని ద్వారా అంతిమ లబ్ది పొందేందుకు ఇప్పుడు తన దాడిని తీవ్రతరం చేయడమే పరిష్కారంగా భావిస్తున్నట్లుగా అందుకే మరింత బలంగా మోడీ-అమిత్ షా వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.