అనంతపురంలో చంద్రబాబు అమరావతి మద్దతు ర్యాలీలు: చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నిరసనలు
అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు . సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి ఏపీలో ఆందోళనలు మిన్ను ముడుతున్నాయి. మొదట నుండీ రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామని తమ స్టాండ్ ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధానే ముద్దు అంటున్న చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆయన పలు జిల్లాలలో ర్యాలీలు చేస్తున్నారు. ఇక వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఏపీలో టెన్షన్ నెలకొంది.
అనంతలో జోలె పట్టి అమరావతి కోసం చంద్రబాబు విరాళాలు
ఇందులో భాగంగా ఇవాళ అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు పర్యటన అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది . కొడికొండ చెక్ పోస్టు నుంచి చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రహదారులపై జోలె పట్టి అమరావతి కోసం చంద్రబాబు విరాళాలు సేకరించారు.
హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో సభల్లో పాల్గొననున్న చంద్రబాబు
పెనుకొండలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సాయంత్రం చెన్నేకొత్తపల్లి, మామిళ్లపల్లి, రాప్తాడు మీదుగా బళ్లారి బైపాస్కు చేరుకుంటారు. సాయంత్రం క్లాక్ టవర్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. ఇక రాయలసీమ వాసులకు చంద్రబాబు అన్యాయం చేశారని చంద్రబాబు ర్యాలేని అడ్డుకుంటామని చెప్తున్నారు పలు ప్రజా సంఘాల నాయకులు.
చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నేతల నిరసన ర్యాలీలు
రాయల సీమలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో చాలా మంది చంద్రబాబు అమరావతి రాజధానిగా ఉండాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక నేడు చంద్రబాబు పర్యటన నేపధ్యంలో అనంతపురం జిల్లాలో కాస్త టెన్షన్ నెలకొంది. అనంతపురం జిల్లా పెనుగొండలో వైసీపీ నిరసన ర్యాలీకి పూనుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసన తెలియజేస్తున్నారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ ర్యాలీలతో అనంతలో టెన్షన్
హిందూపురంలో నల్ల రిబ్బన్లతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చంద్రబాబుకు రాజధాని విషయంలో మాట్లాడే నైతిక హక్కు లేదని రాయలసీమ వాసులను మోసం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ఆందోళనలతో మరోపక్క మద్దతు కోసం కొనసాగుతున్న ర్యాలీలతో అనంతపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.