ఇదే మా వ్యూహం: రామ్మోహన్ నాయుడు, గలాట సృష్టిస్తే: బాబు సూచనలు
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి విభజన హామీలు అమలు చేయని కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. తమకు ఇచ్చిన 13 నిమిషాలను సద్వినియోగం చేసుకునేందుకు టీడీపీ సిద్ధమైంది. అందుకే అవిశ్వాస తీర్మానంపై చర్చను గల్లా జయదేవ్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు మాట్లాడుతారు.
సమయం, సందర్భాన్ని బట్టి కేశినేని నాని, తోట నర్సింహంలు మాట్లాడుతారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. తమకు ఇచ్చిన పదమూడు నిమిషాల చాలదని, అవిశ్వాసం పెట్టింది తామే కాబట్టి మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తామన్నారు.
గల్లా జయదేవ్ తర్వాత అవకాశముంటే మాట్లాడుతారు
తమ తరఫున గల్లా జయదేవ్ చర్చను ప్రారంభిస్తారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆపై అవకాశాన్ని బట్టి మరొకరు లేదా ఇద్దరు మాట్లాడుతారని తెలిపారు. ప్రత్యేక హోదా గానీ, విభజన చట్టంలో ఉన్న హామీలు గానీ ఏవైతే కేంద్రం నెరవేర్చలేదో వాటిని గుర్తు చేస్తామని తెలిపారు. కేంద్రం ఏవైతే కారణాలు చూపిస్తుందో, అవి సరైన కారణాలు కావన్న విషయాన్ని దేశమంతటికీ తెలియజేస్తామన్నారు.
కేంద్రం కొన్ని కారణాలను సాకుగా చూపిస్తోంది
ఏపీకి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి కొన్ని కారణాలను కేంద్రం సాకుగా చూపిస్తోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే అన్ని హామీలను నెరవేర్చవచ్చునని తెలియజెప్పే వ్యూహంతో ఉన్నామని తెలిపారు. రెవెన్యూ లోటు, అమరావతికి నిధులు తదితర అంశాలను ప్రస్తావిస్తామన్నారు. అన్ని అంశాలపై సభలో చర్చిస్తామని చెప్పారు.
అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టడమే
తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాసంతో కేంద్రాన్ని ఎండగట్టాలని సూచించారు. ఈ సమయంలో బీజేపీకి ఎవరు అనుకూలమో, ఎవరు ప్రతికూలమో తేలిపోతుందన్నారు. మెజార్టీ వర్సెస్ మోరాలిటీ చర్చ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఆధిక్యత ముఖ్యమా, నైతికత ముఖ్యమా.. చర్చ ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
సభలో గలాట సృష్టిస్తే..
సభ సజావుగా జరిగే అవకాశముందా, గలాటా సృష్టిస్తే ఏం చేయాలి.. అనే అంశాలపై చంద్రబాబు ఎంపీలకు సూచన చేశారు. అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. విధిలేని పరిస్థితుల్లో అవిశ్వాసానికి మద్దతు అంటూ వైసీపీ షో చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఉనికి కోసమే వైసీపీ ఆరాటమని, పోరాట స్ఫూర్తి లేదన్నారు.
టీడీపీపై కోపం హోదాకు అడ్డుకావొద్దు: బీజేపీకి పవన్, ముఖ్యమైన రోజు: మోడీ