ర్యాంకులు రివర్స్: వారి స్పీడ్ తగ్గించేందుకు చంద్రబాబు వ్యూహమా?
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పీతల సుజాత, రావెల కిషోర్ బాబులకు టాప్ టెన్లో ర్యాంకు రావడం, యనమల రామకృష్ణుడు, పీ నారాయణలకు చివరి స్థానాలు రావడం చర్చనీయాంశమయింది.
మంత్రి పీ నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుడిభుజంగా ఉంటూ, ప్రభుత్వంలో దాదాపు అన్నీ తానై చక్రం తిప్పుతున్న నారాయణకు చివరి ర్యాంక్ వచ్చింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడికి 15వ ర్యాంక్, కర్నూలు కీలక నేత కేఈ కృష్ణమూర్తికి 17వ ర్యాంక్ వచ్చింది.
అదే సమయంలో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న పీతల సుజాతకు మొదటి ర్యాంక్ వచ్చింది. తనయుడు ఓ మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించిన కేసులో చిక్కుకున్న మంత్రి రావెల కిషోర్ బాబుకు మెరుగ్గా.. 6వ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకుల విషయంలో చాలా అనుమానాలు కలుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
పత్తిపాటి పుల్లారావుకు మూడో ర్యాంక్ వచ్చింది. ఆయన మాట్లాడుతూ... ర్యాంకుల గురించి తనకు మీడియా ద్వారానే తెలిసింది, మంత్రి నారాయణ రేయింబవళ్లు కష్టపడుతున్నారని, అతనికి చివరి ర్యాంకు రావడంపై తాను ఆశ్చర్యపోతున్నట్లు చెప్పారు.
పీతల సుజాత
మంత్రి పీతల సుజాత పైన గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆమె పని తీరు పైన కూడా చంద్రబాబు అశంతృప్తితో ఉన్నారని, ఆమెను తొలగించి మరొకరికి అవకాశం ఇస్తారనే చర్చ జరిగింది. కానీ పీతల సుజాతకు మొదటి ర్యాంకు వచ్చింది.
రావెల కిషోర్ బాబు
మంత్రి రావెల కిషోర్ బాబు తనయుడు ఎఫెక్ట్, మరో కారణమో కానీ ఆయనను కూడా కేబినెట్ నుంచి తొలగించవచ్చునని ఊహాగానాలు వినిపించాయి. కానీ రావెల కూడా మెరుగైన ర్యాంక్ సాధించారు.
నారాయణ
మంత్రి నారాయణకు దగ్గరగా ఉండే నారాయణ, యనమల రామకృష్ణ వంటి వారికి చివరి ర్యాంకులు రావడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆశ్చర్యపోతోందని చెప్పవచ్చు. పీ నారాయణకు చివరి ర్యాంక్ రావడంపై అంబటి రాంబాబు ఓ విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో నారాయణ స్పీడ్ ఎక్కువైందనే చివరి ర్యాంక్ ఇచ్చి, ఆయన స్పీడ్ తగ్గించే ప్రయత్నం చంద్రబాబు చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు నాయుడు
ఇదిలా ఉండకా.. ర్యాంకుల విషయంలో కొంత పొరపాటు దొర్లిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పది అంశాల ప్రాతిపదికన మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేసి ర్యాంకులు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశిస్తే, కేవలం వారు చేసిన పర్యటనలు, నిర్వహించిన మీడియా సమావేశాల ఆధారంగా హడావిడిగా ర్యాంకులు ఇచ్చారంటున్నారు. ఇది తెలిసి చంద్రబాబు కూడా ర్యాంకులు అసమగ్రమని తేల్చి చెప్పారని అంటున్నారు.