తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు; బెంగళూరు ఆస్పత్రికి రేపు వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
బెంగళూరు: సినీనటుడు నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఆస్పత్రికి చంద్రబాబు శనివారం సాయంత్రం వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
తారకరత్నకు ఐసీయూలోనే చికిత్స: చంద్రబాబు
ఈ సందర్బంగా ఆస్పత్రి ముందు మీడియాతో మాట్తాడారు చంద్రబాబు.ప్రస్తుతం తారక రత్నకు ఐసీయూలోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు కుప్పం వచ్చినప్పటికీ.. అక్కడికంటే బెంగళూరులో ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు రాత్రి 2 గంటలకు ఇక్కడికి తీసుకొచ్చినట్లు తెలిపారు. తారక రత్నను కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ చంద్రబాబు
తారకరత్నకు ప్రస్తుతం ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నారన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. కోలుకోవడానికి ఇంకా టైమ్ పడుతుందని వైద్యులు తెలిపారని చెప్పారు. వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని చంద్రబాబు చెప్పారు.
బెంగళూరు ఆస్పత్రికి చేరుకున్న పురంధ్వేశరి, సుహాసిని
బెంగూళరు ఆస్పత్రికి పురంధేశ్వరి, సుహాసిని కూడా చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారని వారు చెప్పారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితిని అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారని తెలిపారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి చేరుకున్నారు. కాగా, ప్రస్తుతం బాలకృష్ణ ఆస్పత్రిలోనే ఉన్నారు.
రేపు బెంగళూరు ఆస్పత్రికి వెళ్లనున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
కాగా, తారకరత్నను చూసేందుకు ఆదివారం నందమూరి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బెంగళూరు ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఎప్పుటికప్పుడు సోదరుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వారి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సందర్బంగా జనంలో నడుస్తూ ఒక్కసారిగా తారకరత్న కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను స్థానికంగా ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.