జగన్ కళ్లలో ఆనందం కోసమే ఇలాంటి చర్యలు.!ఎంపీ రఘురామ ఎపిసోడ్ పై చంద్రబాబు రియాక్షన్.!
అమరావతి/హైదరాబాద్ : ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారంపై టీడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వినూత్నంగా స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా.?అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం యధేచ్చగా జరుగుతోందని, పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, ఇవి ఎంతో ప్రమాదకర పరిణామాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
రఘురామ ఘటనను ఖండించిన చంద్రబాబు..
అంతే కాకుండా ఎంపీ రఘురామకృష్ణరాజుపై థర్డ్ డిగ్రి ప్రయోగించడం తీవ్రనేరమని చంద్రబాబు పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు ప్రాణాలకు ప్రభుత్వానిదే బాద్యత అని, జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం చట్టాలను ఉల్లంఘిస్తారా? అని బాబు ప్రశ్నించారు. రఘురామకృష్ణరాజును కొట్టడం పోలీసుల దమనకాండకు నిదర్శనమన్నారు బాబు. గౌరవ పార్లమెంట్ సభ్యుడిని ఏ విధంగా శారీరక హింసకు గురిచేస్తారని నిలదీసారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా వెళ్లి అరెస్ట్ చేయడమే పెద్ద నేరంగా బాబు అభివర్ణించారు. ఇప్పుడు థర్డ్ డిగ్రి అమలు చేయడం మరో తప్పని అన్నారు. పారదర్శక విచారణ జరిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీబీసీఐడీ ఉన్నతాధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.
ఏపిలో అధికార దుర్వనియోగం..
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుని అక్రమంగా అరెస్ట్ చేయడమేకాకుండా థర్డ్డిగ్రీ ప్రయోగించడం దుర్మార్గమైన చర్య అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ పేర్కొన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల్లా అరాచకాలకు తెగబడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తోన్న జగన్రెడ్డి రాక్షసపాలనలో ఒక పార్లమెంట్ సభ్యుడిని ఓ నేరస్తుడిలాగా అరెస్టు చేయడం అత్యంత హేయమైన చర్య అని లోకేష్ మండిపడ్డారు.
ఎంపీకే ఈ పరిస్థితి ఉంటే..
అంతే కాకుండా రఘురామ ను కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని వైసీపి ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేసారు లోకేష్. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకే ఈ దుస్థితి ఉంటే, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్షానికి, ప్రజలకి రక్షణ ఎక్కడ ఉంటుందని లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో ఐపీసీ సెక్షన్ల బదులు వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని, ఏపీలో అరాచకపాలనపై ప్రధానమంత్రి, రాష్ట్రపతి, లోక్ సభ స్పీకర్, రాష్ట్ర గవర్నర్ సత్వరమే స్పందించాలన్నారు లోకేష్.
Recommended Video
ఘాటుగా విమర్శించిన అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రఘురామ అరెస్టును ఖండించారు. ఒక ఎంపీపై పోలీసులు బౌతిక దాడికి పాల్పడటం దారుణమైన సంఘటనగా అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఒక యంపీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ధ్వజమెత్తారు. జగన్ డైరక్షన్ లోనే బౌతికహింస జరిగిందని అన్నారు. జగన్ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసినందుకే ఎంపి రఘురామకృష్ణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, రఘురామను అంతమొందించే కుట్ర జరుగుతోందని, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా కంటే లాఠికే ఎక్కువ పని ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు.