అమరావతిలో జడ్జిలకు ఇళ్ల స్ధలాలు- బయటపెట్టిన వైసీపీ- అందరికీ ఇచ్చామన్న చంద్రబాబు..
అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో అప్పటి టీడీపీ సర్కారు అధికారులు, న్యాయమూర్తులతో పాటు పలు ప్రైవేటు సంస్ధలకు సైతం రాజధానిలో భూములు కేటాయించింది. రాజధానిలో అందరినీ భాగస్వాములను చేయాలన్న ఆలోచనతో అప్పటి టీడీపీ సర్కారు చేసిన కేటాయింపులు ఇప్పుడు ఏపీ సర్కారు వర్సెస్ హైకోర్టుగా సాగుతున్న పోరు నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. రాజధానిలో న్యాయమూర్తులకు అప్పటి టీడీపీ సర్కారు భూములు కేటాయించిందని వైసీపీ సోషల్ మీడియాలో ఓ జాబితా సర్క్యులేట్ చేస్తోంది. దీనిపై స్పందించిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తాజాగా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అప్పుడేం జరిగిందో స్పష్టత ఇచ్చారు.
హైకోర్టు తీర్పులపై కేంద్రం జోక్యం కోరిన వైసీపీ- అమరావతి, ఫైబర్ గ్రిడ్పై సీబీఐ విచారణ కూడా..
రాజధానిలో భూకేటాయింపులు..
2015లో అమలావతి నిర్మాణం కోసం అప్పటి చంద్రబాబు సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాలనలో కీలకమైన అధికారులు, న్యాయపాలనలో కీలకమైన న్యాయమూర్తులతో పాటు పలు ప్రైవేటు సంస్ధలకు సైతం భూములు కేటాయించింది. అమరావతి నుంచే పాలన సాగాలంటే వీరంతా ఇక్కడ స్ధిరపడటం ముఖ్యమని భావించడం వల్లే అప్పటి ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా వీరికి భూముల కేటాయింపు చేసింది. కేబినెట్ నిర్ణయాల ఆధారంగానే ఈ కేటాయంపులు బహిరంగంగానే జరిగాయి. పేరుకు భూ కేటాయింపులు జరిగాయనే కానీ ఇప్పటికీ అక్కడ జరిగిన నిర్మాణాలు మాత్రం ఏమీ లేవు. ముఖ్యంగా న్యాయ నగరం పేరుతో చంద్రబాబు కేటాయించిన ఇళ్ల స్ధలాలు ఇప్పటికీ అక్కడ నిరుపయోగంగానే ఉన్నాయి.
హైకోర్టు తీర్పుల నేపథ్యంలో తెరపైకి...
అప్పట్లో అదికారులతో పాటు న్యాయమూర్తులకు అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన భూములపై ఇప్పటివరకూ ఎలాంటి చర్చ లేదు. కానీ తాజాగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్ధానాల్లో వెలువడుతున్న తీర్పులతో అధికార పార్టీ నేతల్లో అసహనం కనిపిస్తోంది. దీంతో వారు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో న్యాయమూర్తులకు కేటాయించిన వాటి వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ చంద్రబాబు ప్రభుత్వం వారికి భూములు కేటాయించడం వల్లే ఇప్పుడు వారు రుణం తీర్చుకుంటున్నారనే విధంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం తీర్చ చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
అందరితో పాటే ఇచ్చామన్న చంద్రబాబు..
అమరావతిలో న్యాయమూర్తులకు ఇళ్ల కేటాయింపుపై జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గతంలో అమరావతి రాజధాని నిర్మాణం సమయంలో తమ ప్రభుత్వం సీఎంవో సహా పలు కీలక విభాగాల్లో ఉన్న బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్ధలాలు కేటాయించామని, వారితో పాటే న్యాయమూర్తులకూ కేటాయించామని చంద్రబాబు వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్యసభలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఈ విషయాన్ని తెలిపారు. కానీ ఇతర వర్గాలను వదిలిపెట్టి కేవలం జడ్జీలకే ఇళ్ల స్ధలాలు ఇచ్చినట్లుగా వైసీపీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇది న్యాయవ్యవస్ధను టార్గెట్ చేయడమేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.