ఇంటి వద్ద పెట్టుకోండి, రోడ్లపై కాదు: వైఎస్ విగ్రహం తొలగింపుపై బాబు
విజయవాడ: వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగింపుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిస్పందించారు. విగ్రహాలు పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే వారి ఇంటి వద్ద పెట్టుకోవాలని ఆయన శనివారంనాడు అన్నారు.
అభిమానం ఉంటే గుండెల్లో పెట్టుకోవాలి గానీ రోడ్లపై విగ్రహాలు పెట్టకూడదని ఆయన అన్నారు. రోడ్లు ప్రజల కోసం ఉన్నాయి గానీ విగ్రహాల కోసం కాదని ఆయన అన్నారు. అనుమతి లేకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న విగ్రహాన్ని తొలగిస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. రోడ్లపై విగ్రహాలు పెట్టకూడదని గతంలోనే చట్టం తెచ్చామని ఆయన గుర్తు చేశారు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోని టాప్ ఐదు సిటీల్లో ఒక్కటిగా నిలపాలనేది తన లక్ష్యమని ఆయన చెప్పారు గోదావరి పుష్కరాల కన్నా కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానంతో ఎపి నీటి సమస్యను తీర్చామని చెప్పారు. భావి తరాల కోసమే వనం- మనం కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు చెప్పారు.
విజయవాడ అన్నింటికీ కేంద్రంగా ఉందని చంద్రబాబు చెప్పారు. కృష్ణా పుష్కరాల కోసం రూ. 1700 కోట్లతో పుష్కరఘాట్లు ఏర్పాటు చేశామన్నారు. రహదారులు, ఆలయాల మరమ్మతులు చేశామని సీఎం చెప్పారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ట్రాన్స్ఫామ్ విజయవాడ పేరుతో విద్యార్థులు ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొన్నారు.