పోలవరంపై శ్వేతపత్రం విడుదల చెయ్ .. చంద్రబాబు బహిరంగ చర్చకు సిద్ధమా... మరో బహిరంగ లేఖలో కేవీపీ సవాల్
Recommended Video
ఆంధ్రప్రదేశ్ వాసుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై ఏపీలో రసవత్తర చర్చ జరుగుతుంది . మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు తగ్గేది లేదంటూ విమర్శలకు దిగుతున్నారు. పోలవరం పై బహిరంగ లేఖ రాసి వేడి రాజేసిన కేవీపీ రామచంద్రరావు , మరో మారు బహిరంగ లేఖ రాసి చంద్రబాబుకు సవాల్ విసరటం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
పోలవరం అంచనావ్యయం పెంచిన విషయంలో ఏపీ సీఎంకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ
పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచిందని దాన్ని తాము భరించబోమని కేంద్రం స్పష్టం చేసిందని , ఈ విషయం దాచిపెట్టి రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని మోసేందుకు సిద్ధం అయ్యిందని కేవీపీ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రూ.28,467 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని , ఇది చంద్రబాబుకు తెలిసినా ఆయన ప్రజలకు చెప్పడం లేదని ఆయన ఆరోపించారు . ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేలా అధికారులకు సీఎం ఆదేశాలివ్వాలి' అని కేవీపీ డిమాండ్ చేశారు.
కేవీపీ లేఖపై మండిపడిన దేవినేని ఉమా.. పోలవరం పై విషం చిమ్ముతున్నారని మండిపాటు
ఇక కేవీపీ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు. దేశం గర్వించదగ్గ మహోన్నత పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై వైయస్ ఆత్మ కేవీపీ విషం చిమ్ముతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. బీజేపీ , వైసీపీ కోవర్టుగా పని చేస్తున్న కేవీపీ పోలవరం నిర్మాణ రికార్డులు చూసి సిగ్గుపడాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞoగా మార్చి డబ్బులు దండుకున్న కేవీపీ పోలవరంపై ఉత్తరాలు రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు రాకుండా ప్రధాని కార్యాలయం అడ్డుపడుతున్నా నోరెందుకు మెదపరని ప్రశ్నించారు. కేసీఆర్ పోలవరం మీద సుప్రీంకోర్టులో కేసులు వేశారని.. గ్రీన్ ట్రైబ్యునల్లో కవిత కేసు వేశారని అవి మీ దృష్టిలో లేవా అని ఉమ ప్రశ్నించారు. బహిరంగ లేఖ రాసిన కేవీపీపై నిప్పులు చెరిగారు దేవినేని ఉమా
మరోమారు పోలవరంపై బహిరంగ లేఖ రాసిన కేవీపీ .. శ్వేతపత్రం విడుదల చెయ్యాలని , బహిరంగ చర్చకు రావాలని సవాల్
ఇక ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చెయ్యాలని, మరోసారి బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. మంత్రికి పోలవరంపై ఎంత అవగాహన ఉందో ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. కేవీపీ లేఖపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కేవీపీ పోలవరం ప్రాజెక్టుపై ఓనమాలు కూడా తెలియని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు వల్లే తీరని అన్యాయం జరుగుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని , పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు కేవీపీ సవాల్ విసిరారు. తాను రాసిన లేఖను చదవకుండానే విమర్శలు చెయ్యడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానని కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. 18 నెలలుగా పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్ వేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.