ఆదికి షాక్ : చంద్రబాబు 'నో అపాయింట్ మెంట్..'
కడప : వెళ్లేవరకు ఓ బాధ.. వెళ్లిన తర్వాత ఓ బాధ అన్నట్టుగా తయారైంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మేల్యేల పరిస్థితి. కొత్తగా వచ్చిన ఎమ్మెల్మేలకు పార్టీలో సరైన మర్యాదలు లభించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటు నేతలతో పాటు సీఎం చంద్రబాబు కూడా కొత్తగా చేరిన పట్ల అలసత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆదినారాయణ రెడ్డి విషయాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు చాలామంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో, తన బలా బలాలేంటో వైసీపీకి రుచి చూపించాలనే ధోరణితో ఉండేవారు ఆది. ఇందుకోసం ఆయన దివంగత సీఎం వైఎస్సొంతూరులో జరగబోయే పంఛాయితీ ఉపఎన్నికలను ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించి తన సత్తా ఏంటో చాటాలని భావించారు.
తద్వారా ఇటు టీడీపీలోను పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందనేది ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ సీఎం చంద్రబాబు కూడా ఆదిని దూరం పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం త్వరలో జరగబోయే బలపనూరు సర్పంచ్ ఉపఎన్నికల సందర్భంగా ఇవ్వాల్సిన అభివృద్ది హామిల గురించి, నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ది పనుల గురించి ఓ నివేదిక తయారు చేసి చంద్రబాబుకు ఇవ్వాలని భావించారట ఆది.
అయితే.. తీరా ప్రణాళికలన్నీ సిద్దం చేసి పెట్టుకున్నాక ఆదికి చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదట. అపాయింట్ మెంట్ పెద్ద విషయమేమి కాదని భావించిన ఆదికి ఇదొక షాక్ అని చెప్పుకుంటున్నారు పలువురు. రోజులు గడుస్తున్నా..! అపాయింట్ మెంట్ పై క్లారిటీ లేకపోవడంతో, ఏం చేయాలో తోచని స్థితిలో ఆది ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఆది ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందికర పరిస్థితులు చూసి ఆయన ప్రత్యర్థులు మాత్రం తెగ సంతోషిస్తున్నారట.