12 ఏళ్ల క్రితం నాపై దాడి, దేవుడు ఇందుకే నన్ను బ్రతికించాడేమో: చంద్రబాబు
తిరుపతి: సరిగ్గా 12 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన శుభదినాన, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అలిపిరి ఘాట్ వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఈ సంఘటనకు సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్మరించుకున్నారు. "శ్రీవారి బ్రహ్మోత్సవం కన్నా మంచి రోజు మరొకటి వుండదు. 2003లో బ్రహ్మోత్సవాల రోజునే నాపై దాడి జరిగింది. నేడు అదే సుదినాన కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం జరుగుతోంది. ఏపీ ప్రజలకు ఇంతకన్నా శుభప్రదమైన రోజు ఉంటుందా? ఈ మంచి కార్యం కోసమే ఆ దేవుడు నన్ను ఆరోజు ప్రాణాలతో మిగిల్చాడేమో" అని ఓ ప్రముఖ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
ఇక నదుల అనుసంధానం అయితే గోదావరి, కృష్ణా నదులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింతగా మేలు జరుగడంతో పాటు జీవనాధారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. వృథాగా సముద్రంలోకి పోయే 3 వేల టీఎంసీల నీటిని వివిధ ప్రాజెక్టుల ద్వారా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లగలిగితే, అత్యంత సుసంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగులుతుందన్నారు.