వైఎస్ జగన్ జీరో సీఎం: ఏడాది పాలనపై టీడీపీ ప్రచారం: వైసీపీ సర్కార్కు చంద్రబాబు మార్కులు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిందేమీ లేదంటూ ఆరోపిస్తోంది. వైఎస్ జగన్ ఏడాది పాలనకు జీరో మార్కులు వేసింది. అందుకే- ఆయనను జీరో ముఖ్యమంత్రిగా సంబోధిస్తోంది. ఈ దిశగా సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ పాలనపై విమర్శల దాడిని ముమ్మరం చేసింది.
జగన్ మరో కీలక నిర్ణయం.. గ్రేట్ ప్లాన్.. అదే జరిగితే ఏపీకి మహర్దశే..
ఆదాయం పెరుగుదల సున్నా..ఖజానాకు సున్నం
వైఎస్ జగన్ రాష్ట్రానికి పైసా కూడా ఉపయోగపడని ముఖ్యమంత్రి అని, అందుకే ఆయనకు, ఆయన పరిపాలనకు జీరో మార్కులు వేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బొత్తిగా ఆదాయం లేకుండా పోయిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదాయం లేకుండా పరిపాలన ఎలా సాగిస్తారని, సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆదాయాన్ని పెంచలేకపోతోందని విమర్శించారు.
రంగుల వేయడం తప్ప ఏం సాధించినట్లు
ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలు సున్నా, ఉద్యోగాలు సున్నా, రాష్ట్ర ప్రగతి సున్నా, ప్రజల ఆదాయంలో పెరుగుదల సున్నా. నిర్మాణాలు సున్నా. ఉన్న నిర్మాణాలకు పార్టీ రంగులేసి ప్రభుత్వ ఖజానాకు సున్నం వేయడం తప్ప ఈ సున్నా ముఖ్యమంత్రి ఏం చేసినట్టు.. అని చంద్రబాబు విమర్శించారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గాడి తప్పిన వ్యవస్థలు..
వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే వ్యవస్థలన్నీ గాడి తప్పాయని చంద్రబాబు ఆరోపించారు. తమ స్వార్థం కోసం ఉద్దేశపూరకంగా రాష్ట్రాభివృద్ధిని నాశనం చేశారని విమర్శించారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనుల నిలిపి వేయడమే దీనికి నిదర్శనమని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను చక్కదిద్ది, అభివృద్ధిని పరుగులు పెట్టించామని చంద్రబాబు చెప్పారు.
Recommended Video
పారిశ్రామికవేత్తలు భయపడేలా..
పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను తాము అధికారంలోకి వచ్చిన తరువాత చక్కదిద్దామని అన్నారు. వైసీపీ నాయకులు మళ్లీ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడేలా వైఎస్ జగన్ పాలన కొనసాగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పరిశ్రమలు లేని రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి సాధిస్తుందని ప్రశ్నించారు.
పెట్టుబడులు రాబట్టలేక..
పెట్టుబడులు వస్తే తమకు లాభమేంటీ అనే ధోరణిలో వైసీపీ నాయకులు ఉన్నారని, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని, ఆదాయం పెరుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని రాబట్టలేకపోతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రజలకు ఈ ప్రభుత్వం పెనుభారంగా మారిందని విమర్శించారు.