వైసీపీ ఎంపీల రాజీనామా, ఎయిర్ ఏషియా కుంభకోణంపై స్పందించిన చంద్రబాబు
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా, ఎయిర్ ఏషియా స్కాంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. కడప జిల్లాలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఏపీపై కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
Recommended Video
ఎయిర్ఏషియా ఎఫెక్ట్, గుర్తుపెట్టుకోండి.. ప్రకంపనలు సృష్టించే స్కాం బయటపెడ్తాం: కేంద్రంపై సంచలనం
ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే, వాటిని ఆమోదిస్తే ఎన్నికలు రావని చెప్పారు. ఈ విషయం తెలిసే వారు రాజీనామాలు చేశారని చెప్పారు. ఇప్పుడు రాజీనామాలను స్పీకర్ ఆమోదించినా వాటి వల్ల ఉపయోగం లేదని చెప్పారు. వైసీపీ ఎంపీలు ప్రతి అభివృద్ధిని పనిని అడ్డుకుంటున్నారని చెప్పారు. వారు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారారన్నారు. హోదా కోసం రాజీనామా అంటూ వారు డ్రామాలు ఆడుతున్నారన్నారు.
తాను కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీరు ఇస్తానని చెప్పానని చంద్రబాబు గుర్తు చేశారు. అన్నట్లుగానే నీటిని ఇచ్చానని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు మనం కేంద్రంపై పోరాడుతున్నామన్నారు. అందుకే నవ నిర్మాణ దీక్ష చేపట్టామన్నారు. నాకు మీ అందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.
లాలూచీ రాజకీయాలకు పాల్పడే వారిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలన్నారు. ఎక్కడో ఎయిర్ ఏషియా స్కాం జరిగితే, ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే తన పేరును లాగడం ఏమిటని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి, 11 కేసుల్లో ఏ1గా ఉన్న ముద్దాయి తన పైన ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.