అమిత్ షాకు దర్శనం బాగా అయింది: అధికారులకు సీఎం వార్నింగ్, 'బాబు ప్లానే.. ఇవే ఆధారాలు!'
అమరావతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కాన్వాయ్ పైన అలిపిరి వద్ద జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి ఘటనలు సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దాడులను తమ పార్టీ ప్రోత్సహించదన్నారు.
చదవండి: అమిత్ షా కాన్వాయ్పై దాడి, బాబు వైపు బీజేపీ వేళ్లు: ఇదీ జరిగింది.. ఏమైందో చెప్పిన ఎమ్మెల్యే
గురువారం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో అమిత్ షా శుక్రవారం తిరుమల వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కొండపై నుంచి తిరిగి వస్తుండగా అలిపిరి వద్ద కొందరు టీడీపీ వాళ్లు ఆయన కాన్వాయ్ పైన రాళ్ల దాడి చేశారు. దీనిపై ఇంతకుముందే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం దాడి ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
చదవండి: వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి: అమిత్ షాపై దాడి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
అమిత్ షాను అలా గౌరవించాం
అనంతరం చంద్రబాబు ఈ దాడిపై స్పందించారు. తిరుమలలో అమిత్ షాను సంప్రదాయంగా గౌరవించామని చంద్రబాబు నాయుడు తెలిపారు. అమిత్ షా శ్రీవారి దర్శనాన్ని ప్రశాంతంగా తెలుసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తిరుమల సంప్రదాయం ప్రకారం అతనిని గౌరవించి శ్రీవారి పటాన్ని అధికారులు కానుకగా ఇచ్చారు.
దర్శనం బాగా జరిగింది కానీ కొండ కింద అలా జరగాల్సింది కాదు
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం బాగానే జరిగిందని, కానీ కొండ కింద అలాంటి సంఘటన జరగాల్సింది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షులు వచ్చినప్పుడు పోలీసులు మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండవలసింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేను ఖండించాను, అధికారులకు హెచ్చరిక
అమిత్ షా కాన్వాయ్ పైన దాడి జరిగిన విషయం తెలియగానే తాను ఈ ఘటనను తీవ్రంగా ఖండించానని చంద్రబాబు తెలిపారు. అలాగే, ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని తాను అధికారులకు గట్టిగా చెప్పానని తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ అధికారులు, పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఇప్పటికే బీజేపీ ఆరోపిస్తోంది. కాన్వాయ్పై దాడి అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పూర్తి సమాచారం తెప్పించుకొని టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని నిర్ధారణకు వచ్చాకే చంద్రబాబు ఇలా స్పందించి ఉంటారని అంటున్నారు.
బాబుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ
ఇలాంటి సంఘటనలు సరికాదని, పార్టీ క్రమశిక్షణతో ఉండాలని, తెలిసీ తెలియని ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకు రావొద్దని నేతలకు చంద్రబాబు హితవు పలికారు. కాగా, ఈ దాడి నేపథ్యంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. చంద్రబాబుకు తెలిసే అమిత్ షా పైన దాడి జరిగిందని బీజేపీ నేతలు అంటున్నారు. అమరావతిలో కుట్రలో భాగంగా తిరుపతిలో ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అమిత్ షాకు చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దాడి చేయించి ఖండించడం చంద్రబాబుకు అలవాటు
ఈ దాడి చంద్రబాబు ప్రోత్సాహంతోనే ముందస్తు పథకంలో భాగంగా జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ జాతీయస్థాయి నాయకుడికే రక్షణ లేకుంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు. ముందు దాడి చేయించడం ఆ తర్వాత దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పడం చంద్రబాబుకు అలవాటేనని మండిపడుతున్నారు. అమిత్ షా కాన్వాయ్ తిరిగి వస్తుండగా దాడి జరిగింది. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలో, రోప్ పార్టీని ఛేదించుకొని వచ్చి టీడీపీ వారు ఎలా దాడికి పాల్పడ్డారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ కాకుంటే ఇంత పకడ్బంధీగా దాడి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దాడిపై టీడీపీ నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.