కాల్ మనీని వదలం, వనజాక్షి హద్దు దాటింది: బాబు, మంత్రులకు హెచ్చరిక
హైదరాబాద్: కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రతిపక్షాల వద్ద ఆధారాలు ఉంటే వ్యక్తిగతంగా తనకు కూడా ఇవ్వవచ్చునని, నిందితుల పైన కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. అదే సమయంలో తహసీల్దార్ వనజాక్షి ఘటన పైనా స్పందించారు.
మండలి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాల్ మనీ కేసులో తప్పు చేస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. శాసన సభలోను ఇదే చెప్పామన్నారు. కాల్ మనీ పైన దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు.
అక్రమ వడ్డీలు వసూలు చేస్తే కట్టవద్దని ప్రజలకు పిలుపునిచ్చానని చెప్పారు. అదే సమయంలో నిజమైన వడ్డీ వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. మంచివాళ్లకు ఇబ్బందులు కలిగించమని, చెడ్డవాళ్లను మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు.
చిన్నచిన్న అంశాలను పెద్దవిగా చూపవద్దని హితవు పలికారు. కాల్ మనీ దారుణాలు ఇప్పుడు కొత్తగా జరిగినవి కాదని, చాలా రోజులుగా సాగుతున్నాయన్నారు. రాజధాని ప్రాంతం పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు ఎవరూ అసాంఘిక కార్యక్రమాలు చేయలేదన్నారు.
టిడిపి వారైనా, విపక్ష నేతలైనా అక్రమాలు చేస్తే వదిలేది లేదన్నారు. కాల్ మనీ ఘటనలో అన్యాయంగా బాధితుల ఆస్తులు రాయించుకున్న వారి పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక కోర్టులు పెట్టి నిందితులను శిక్షిస్తామని చంద్రబాబు చెప్పారు.
కాల్ మనీ కేసులో అన్ని పార్టీల నేతలు ఉన్నారని చెప్పారు. తప్పుడు పనులు ఎంత పెద్ద వారు చేసినా అంగీకరించే ప్రసక్తి లేదని, వదిలి పెట్టమన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ గురించి ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలన్నారు. రాజధాని ఇమేజ్ను డామేజ్ చేసే చర్యలు సరికాదన్నారు.
ఎయిర్ పోర్ట్ మేనేజర్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొట్టారన్నారు. వైసిపి నేతలు బాధ్యత లేకుండా ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు. ఏపీ అభివృద్ధి కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు. దయచేసి నన్ను అర్థం చేసుకోవాలన్నారు.
తహసీల్దార్ వనజాక్షి విషయమై మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగికి కూడా బాధ్యత ఉండాలన్నారు. పదేపదే మహిళా ఎమ్మార్వో అనడం సరికాదని, నాటి ఘటనలో మహిళా ఎమ్మార్వోతో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ది.. ఇద్దరిదీ తప్పు ఉందన్నారు. వనజాక్షి హద్దులు దాటి వేరే జిల్లాకు వెళ్లారన్నారు.
చింతమనేని ప్రభాకర్ డ్వాక్రా మహిళల తరఫున వెళ్లారని, ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారన్నారు. ఇక్కడ ఇద్దర్నీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత తనదే అన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఎమ్మార్వోను, ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఎమ్మెల్యేను కంట్రోల్ చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యేలు కూడా గౌరవంగా మెలగాలన్నారు.
మనకు బాధ్యతలు ఎంతుంటాయో కర్తవ్యం అంతే ఉంటుందని అందరికీ హితవు పలికారు. ప్రజలకు తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. అవసరమైతే ఒకరిద్దరని వదులుకుంటాను కానీ ప్రజల నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయనని చెప్పారు.
మా మంత్రులు, ఎమ్మెల్యేలు హద్దు దాటినా నేను ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. బాధ్యతారాహిత్యంగా రాస్తే మీడియాకు కూడా నోటీసులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తద్వారా ఆయన జగన్కు చెందిన సాక్షి పత్రికను ఉద్దేశించి వ్యాఖ్యానించి ఉంటారని భావిస్తున్నారు.
కాల్ మనీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఓ సందర్భంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీ రామచంద్రయ్యకు చంద్రబాబు చురక అంటించారు. ఆయన ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడితే స్వాగతిస్తామన్నారు. మేం అన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నామని, దయచేసి అర్థం చేసుకోవాలన్నారు.