పెదవి విప్పిన బాబు, రేవంత్ను పట్టివ్వాలని స్టీఫెన్కు కేసీఆర్ బెదిరింపు: మత్తయ్య
హైదరాబాద్: లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో అరెస్టైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అంశం ఏపీ కేబినెట్లో ప్రస్తావనకు వచ్చింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై మంత్రుల ఎదుట స్పందించారు.
63 మంది ఎమ్మెల్యేలను గెలిచిన తెరాస 5గురు అభ్యర్థులను ఎమ్మెల్సీ బరిలో ఎలా నిలుపుతుందని చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రుల వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ఎమ్మెల్యేల కొనుగోలు పైన ఆధారపడే తెరాస ఐదుగురిని నిలబెట్టిందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నరాు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, ఏపీ కేబినెట్లో పలు అంశాలపై చర్చించారు. మంత్రులు ఉద్యోగుల బదలీల అంశాన్ని లేవనెత్తారు. జిల్లా మంత్రికి తెలిసే బదలీలు చేయాలన్నారు. ఫైబర్ గ్రిడ్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు సహకారంతో హుధుద్ తుఫాను బాధిత ప్రాంతాలను ఆదుకోవాలని నిర్ణయించారు.
అండర్ గ్రౌండ్ కేబుల్, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునే ఇళ్ల నిర్మాణం తదితరాలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ఇందుకోసం రూ.1500 కోట్లు అప్పుగా ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పెట్టుబడి పెట్టనుంది.
నవ నిర్మాణ దీక్ష పైన మంత్రులకు సూచన చేశారు. మంత్రులు సొంత జిల్లాల్లో నవ నిర్మాణ దీక్షలో పాల్గొనాలని చెప్పారు. 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు మా ఊరు - జన్మదిన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆర్థిక మండలి బోర్డు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని భూమి పూజకు కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజులను ఆహ్వానించనున్నారు.
నేను పరారీలో లేను, స్టీఫెన్ను బెదిరించి రేవంత్ను పట్టివ్వాలన్నారు: మత్తయ్య
తాను పరారీలో లేనని మత్తయ్య అన్నారు. రేవంత్ రెడ్డి ఇష్యూలో మత్తయ్య పేరు కూడా వినిపించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. తాను పరారీలో లేనని చెప్పారు. తనకు ఎవరు ఫోన్ చేయలేదని చెప్పారు. ఈ కేసులో ఏ4గా మాథ్యూస్ జెరుసలేం అలియాస్ మత్తయ్య ఉన్నారు.
దళితుడైన స్టీఫెన్ పైన తెరాస ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విషయంలో తాను మధ్యవర్తిత్వం నడపలేదన్నారు. స్టీఫెన్ సన్ను భయపెట్టి, రేవంత్ రెడ్డిని పట్టివ్వాలని బెదిరించారని, ఆ కుట్రలో తమ ఎమ్మెల్యేను పావుగా చేశారని ఆరోపించారు.
తాను పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పడం విడ్డూరమన్నారు. తాను ఎక్కడకీ వెళ్లలేదని, ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. తన ఫోన్ కూడా ఆన్ లోనే ఉందన్నారు. తన ఫోన్ నెంబర్ ఏసీబీ అధికారులకు తెలుసునని, అలాంటిది తనకు ఫోన్ చేస్తే సరిపోయేదన్నారు.
దళిత క్రైస్తవ వ్యతిరేకి అయిన కేసీఆర్ కుట్రలో ఏసీబీ అధికారులు, పోలీసులు పావుగా మారారన్నారు. అగ్రవర్ణ, అధికార దాహం ఉన్న కేసీఆర్ తనకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తనను ముద్దాయిగా చేసి బలి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కుట్రను ప్రజలకు తెలిపేందుకు తాను శిక్షకు సిద్ధమన్నారు.