భార్యలు చూస్తే..: 'పొలిటికల్ పంచ్'పై బాబు, ఇదీ మా పరిస్థితి అని మోడీతో
సోషల్ మీడియాలో అభ్యంతర ఫోటోలు పెట్టడం తప్పు అని, మీపై వేసే ఆ ఫోటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారని, అందుకే సోషల్ మీడియాలో బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
విజయవాడ: సోషల్ మీడియాలో అభ్యంతర ఫోటోలు పెట్టడం తప్పు అని, మీపై వేసే ఆ ఫోటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారని, అందుకే సోషల్ మీడియాలో బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నీతి అయోగ్ సమావేశం అనంతరం ఏర్పేటు ఘటన, సోషల్ మీడియా, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా పొలిటికల్ పంచ్ రవికిరణ్ ఇష్యూపై స్పందించారు.
సామాజిక మాధ్యమాల్లో బాధ్యతరాహిత్యం తగదన్నారు. జుగుప్సాకర పద్ధతులతో వ్యక్తి గత జీవితాలకు భంగం కల్గించేలా ఎవ్వరూ చేయవద్దన్నారు. ఫోటోలను మార్ఫింగ్ చేసి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కల్గించడం నేరమని, అన్నింటికీ చట్టాలు వర్తిస్తాయన్నారు.
సామాజిక మాధ్యమాలను పాజిటివ్గా, స్ఫూర్తి కల్గించే విధంగా ఉపయోగించుకోవచ్చునని, వ్యక్తులను రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదని చెప్పారు. విధానాలను ఎవరైనా విమర్శించొచ్చు కానీ, ప్రధాన ప్రసారసాధనాల వలే సామాజిక మాధ్యమాలూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్
పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ అరెస్టు, వైసిపి సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసుల దాడి ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే.
అంతకుముందు, ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర పరిస్థితులను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి ఏపీ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు.
మోడీకి విజ్ఞప్తి
ఇప్పటి వరకూ నవ్యాంధ్రకు చేసిన సహాయానికి ధన్యవాదాలు అని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని సరైన సమయంలో కొంతవరకు ఆదుకున్నారని, అయినప్పటికీ దక్షిణాదిలో అందరికంటే వెనుకబడి ఉన్నామని, ఇంకా బాగా కష్టపడితే తప్ప సమీప భవిష్యత్తులో వారిని అందుకొనే పరిస్థితి లేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.
దక్షిణాదిలో..
మూడురాష్ట్రాలకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై మహా నగరాలు ఉన్నాయని, కేరళకు పర్యాటక బలం ఉందని, తమకు అలాంటి నగరాలు కానీ, మౌలికవసతులు కానీ లేవని చంద్రబాబు అన్నారు.
అన్నింటా మేమే ఫస్ట్
అన్నింటినీ పునాదుల నుంచి నిర్మించుకోవాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. ఒకవైపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలో తొలిస్థానంలో నిలిచామని, కేంద్రం పెట్టిన ప్రతి పోటీలోనూ తొలి స్థానాల్లోనే నిలుస్తున్నామన్నారు.
ఎన్ని చేసినా మైనస్ నుంచి ఎదగాలి
ఎన్ని చేసినా తాము మైనస్ నుంచి ప్రయాణం మొదలుపెట్టినందున మిగతా రాష్ట్రాలను అందుకోలేకపోతున్నామని, వాటితో సమానంగా ఎదిగేంతవరకూ మీరు చేయూతనివ్వాలని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు.
ఇదీ మా పరిస్థితి... ఎంత ఇస్తారో ఇవ్వండి
అన్ని విషయాల్లో ఏపీ మిగతా రాష్ట్రాలతో పోటీపడుతోందని, 2016-17 లెక్కల ప్రకారం ఏపీ తలసరి ఆదాయం రూ.1,22,376గా ఉందన్నారు. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని, దీనికి కారణం విభజన, దాని తర్వాత వచ్చిన ఇబ్బందులు అని చెప్పారు. తమకు పట్టణ జనాభా లేదని, ఆదాయం తక్కువ, వ్యవసాయం ఎక్కువ ఉందని చెప్పారు.
ఇన్ని ఇబ్బందుల్లోనూ గత మూడేళ్లలో సగటున 10.36 శాతం వృద్ధి సాధించి జాతీయ సగటు కంటే మూడు శాతం ముందున్నామని, ఏపీకి తొలి ఏడాది రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయాలని, తాము రూ.16వేల కోట్లు అడుగుతున్నామని, మీరు రూ.7 వేల కోట్లు అంటున్నారని, ఎంత ఇస్తారో ఇవ్వండని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.