ప్రపంచంలో పరువు తీశారు: కెవిపిపై బాబు, అది జగనే!
హైదరాబాద్: టైటానియం కుంభకోణం కేసుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం నిప్పులు చెరిగారు. టైటానియం కుంభకోణం కేసులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు పేరు ఛార్జీషీటులో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనిపై చంద్రబాబు గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. టైటానియం కుంభకోణంలో మొత్తం రూ.111 కోట్లు చేతులు మారాయని విమర్శించారు. 2006లోనే టైటానియం కుంభకోణానికి బీజం పడిందని అన్నారు. అమెరికాకు చెందిన సంస్థ రూ.111 కోట్లు చెల్లించిందన్నారు.
దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఎఫ్బిఐ దర్యాప్తు చేసి ఛార్జిషీటు దాఖలు చేసిందని ఆయన అన్నారు. ఈ ఛార్జీషీటులో వైయస్ ఆత్మ బంధువు కెవిపి, వైయస్ దగ్గరి బంధువు పేర్లు ఉన్నాయన్నారు. ఈ ఉదంతంతో కొందరు అంతర్జాతీయ స్థాయంలో రాష్ట్రం పరువు తీశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమీప బంధువు జగనే అన్నారు. ఈ కుంభకోణంపై జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమాధానం చెప్పాలన్నారు.
కాంగ్రెస్కు హ్యాండిచ్చిన బాజిరెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెసు పార్టీకి చేయిచ్చారు. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని కొంతకాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఆయనకు నిజామాబాదు జిల్లాలో ఓ నియోజకవర్గాన్ని కూడా ఇచ్చేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందని వార్తలు వచ్చాయి. ఆయన గురువారం ఢిల్లీకి వెళ్లారని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి.
అయితే, ఆయన ట్విస్ట్ ఇచ్చారు. బాజిరెడ్డి కాంగ్రెసు పార్టీకి హ్యాండిచ్చి తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారట. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట. తెరాస ఆయనకు నిజమాబాద్ రూరల్ సీటును కేటాయించనుందంటున్నారు. తాను కాంగ్రెసు పార్టీలో చేరుతానని టిపిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు బాజిరెడ్డి హామీ ఇచ్చారట. అయితే, చివరి నిమిషంలో బెర్తు ఖాయం కావడంతో తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారట.