విజయసాయి తల్లీతండ్రికి అంటాడా, చెప్పుకోలేని పదాలు: అసెంబ్లీలో బాబు భావోద్వేగం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధించాయని, అమ్మానాన్నను అంటారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ఆయన ఏపీ అసెంబ్లీలో చాలాసేపు మాట్లాడారు. కేంద్రం తీరుపై మండిపడుతూ.. ఏపీకి హోదా కోసం రాష్ట్రంలోని వారు అందరు కలిసి రావాలన్నారు.
రాజ్యసభలో మోడీ ఫేర్వెల్ స్పీచ్: సీఎం రమేష్ రాజీనామా, ఇదీ కారణం
ఈ సందర్భంగా విజయసాయి తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఓ తల్లికి, ఓ తండ్రికి పుట్టిన వాడు అంటారా అని చంద్రబాబు నిలదీశారు. తల్లిదండ్రులు అంటే మనం దేవుళ్ల పక్కన ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తామన్నారు. ఇలాంటి భాష మాట్లాడుతారా అన్నారు. సభలో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన హెడ్డింగ్ చూపిస్తూ, విజయసాయి రాసిన మాటలను చెబుతూ.. ఈ మాటలు బాధించాయన్నారు.
ఓ నిందితుడు తల్లికి, తండ్రికి పుట్టినవాడు అంటాడా?
ఓ నిందితుడు తనను పట్టుకొని ఒ తల్లికి, తండ్రికి పుట్టినవాడు అయితే అంటాడా అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నాకు కూడా ఓ మనసు ఉంటుందని, బాధ ఉంటుందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే తాను అమ్మకు వందనం అనే కార్యక్రమం ప్రారంభింపచేశామన్నారు. ఏది ఏమయినా బాధ, ఎమోషన్, ఆవేదన ఉంటుందని చెప్పారు. నేను నా కోసమో, నా కుటుంబం కోసమో పని చేయడం లేదని, కష్టపడితే ఏపీకి బాగుంటుందని ముందుకు సాగుతున్నానని చెప్పారు.
చెప్పుకోలేని పదాలతో విమర్శలు
చెప్పుకోలేని పదాలతో విజయసాయి రెడ్డి విమర్శలు చేశారని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో 40 ఏళ్లు హుందాగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఒక్క మాట అనలేదన్నారు. తనకు రాజకీయం ముఖ్యం కాదని, ఎవరి పైనా కోపం లేదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం కేంద్రంపై పోరాటం అన్నారు.
కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు
ఇలాంటి పరిస్థితుల్లో మనమంతా సంఘటితంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. కొందరు రెచ్చగొట్టే పనులు చేస్తారని, ఎవరు ఏం చేసినా కలిసి ముందుకు సాగుదామన్నారు. కేంద్రం మోసం చేస్తోందని,ఏపీ ప్రజలు చేసిన తప్పేమిటన్నారు. హోదా అడిగితే స్పెషల్ పర్పస్ వెహికిల్ అంటున్నారని మండిపడ్డారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచన మంచిది కాదన్నారు. అమరావతి డ్రీమ్ సిటీ అంటే వెటకారం సరికాదన్నారు.
అనుభవంతో చెబుతున్నా.. బాగుపడలేదు
తాను నలభై ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, ఎదురుదాడి చేసిన వారు ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరి సహకారం ఉండాలన్నారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్నారు. కచ్చితంగా ఢిల్లీకి వెళ్తామని, అందరినీ ఏకం చేస్తామని చెప్పారు. పొత్తు పెట్టుకున్న పార్టీకి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు.