సాక్షి రిపోర్టర్ నుంచే, లావణ్య పేరు.. పేపర్ లీకేజ్లో కుట్ర కోణం: జగన్కు బాబు షాక్
అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులను తాను ఎప్పుడూ చూడలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాసన సభలో అన్నారు. మంగళవారం సభలో పలుమార్లు గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే.
అమరావతి: అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితులను తాను ఎప్పుడూ చూడలేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శాసన సభలో అన్నారు. మంగళవారం సభలో పలుమార్లు గందరగోళం చెలరేగిన విషయం తెలిసిందే.
సభ్యుల నిరసనల మధ్య పలు బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలేది లేదని చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
జగన్ తీరుతో ఆశ్చర్యం వేస్తోంది
జగన్ తీరును చూస్తే ఆశ్చర్యం వేస్తోందన్నారు. సభలో ఇలాంటి పరిస్థితులు ఏమిటన్నారు. భూమా నాగిరెడ్డి చనిపోతే సభలో తీర్మానం పెడితే, జగన్ దానికి హాజరు కాలేదన్నారు. ఇంటర్నేషనల్ వాటర్ డే రోజు జగన్ బయటకు వెళ్లారన్నారు. స్పీకర్ లేచి ప్రతిజ్ఞ చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు మాత్రం కూర్చుండిపోయారని చెప్పారు.
నాకు మైక్ ఇవ్వలేదు
గతంలో చాలాసార్లు తనకు మైక్ ఇవ్వలేదని చెప్పారు. తాను అప్పుడు మైక్ కోసం పోరాడాను తప్పితే, ఏ రోజు కూడా సభ నుంచి బయటకు వెళ్లిపోలేదని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పామన్నారు.
అగ్రిగోల్డ్ అంశంపై..
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తామంటే ప్రతిపక్షం ఆరోపణలు చేసిందన్నారు. అగ్రిగోల్డ్ విషయంలో మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఆరోపణలు చేశారని, ఆయన సవాల్ విసిరితే, జగన్ పారిపోయారన్నారు. హౌస్ కమిటీ వద్దని, జ్యూడిషియల్ విచారణ కావాలని జగన్ అడిగారని, తాను సరేనని చెబితే, ఆయన పారిపోయారన్నారు.
కేశినేని, ఉమలతో సారీ చెప్పించా
తాను ఓ బాధ్యత కలిగిన వ్యక్తిని అని చంద్రబాబు చెప్పారు. ఓ వైపు తాను సీఎంగా, మరోవైపు టిడిపి అధ్యక్షుడిగా ఉన్నానని చెప్పారు. రవాణా శాఖ అధికారులతో తమ పార్టీ నేతలు అనుచితంగా ప్రవర్తిస్తే తాను సీరియస్ అయి, క్షమాపణ చెప్పాలని ఆదేశించానన్నారు. తమ పార్టీ నేతలు తప్పు చేసినా వదిలేది లేదని చెప్పానన్నారు. మా వాళ్లు తప్పు చేస్తే, దానిని అంగీకరించి, కరెక్ట్ చేసుకుంటున్నామన్నారు.
హోదాపై రాజకీయం
ప్రత్యేక హోదా పైన విపక్షం రాజకీయం చేస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వంద శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమయిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇస్తోందన్నారు. అలాంటప్పుడు రాజకీయం చేయడం ఏమిటన్నారు.
టెన్త్ పేపర్ లీక్పై.. లావణ్య పేరు.. సాక్షి రిపోర్టర్ నుంచి..
పదో తరగతి పేపర్ లీక్ అంశంపై అధికారులు వెంటనే స్పందించారని చంద్రబాబు చెప్పారు. లీక్ అయిన క్వశ్చన్ పేపర్ పైన లావణ్య అనే పేరు ఉందన్నారు. ఈ పేరుతో అధికారులు దర్యాఫ్తు చేశారని చెప్పారు. సాక్షి రిపోర్టర్ ఫోన్ నెంబర్ నుంచి టెన్త్ పేపర్ ప్రశ్నాపత్రం డీఈవోకు వచ్చిందని చెప్పారు. అధికారులు ఆ సెంటర్కు వెళ్లి కేసు కూడా నమోదు చేశారన్నారు. విచారణ జరిపి నివేదిక కూడా పంపించారన్నారు.
కుట్ర కోణంపై బాబు అనుమానం
అంతేకాదు, ఇందులో కుట్ర ఉందా అనే అనుమానం కూడా కలుగుతోందన్నారు. పిల్లల జీవితాలతో ఎవరు ఆడుకోవాలన్నా ఖబడ్దార్ జాగ్రత్త అన్నారు. ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదని చెప్పారు. క్వశ్చన్ పేపప్ పైన లావణ్య అనే పేరు ఉందన్నారు. రూం నెంబర్ 7 నుంచి అది లీక్ అయిందని చెప్పారు.
మౌనంగా ఎందుకు ఉన్నారు..
అక్కడ ఇన్విజిలేటర్ తెలుగు పండిట్ మహేష్ ఉన్నారని చెప్పారు. అటెండర్ ఫోటో తీస్తే ఇన్విజిలేటర్ మౌనంగా ఎందుకు ఉన్నారో చెప్పాలన్నారు. పోలీసులకు ఎందుకు అప్పగించలేదన్నారు. ఇవన్ని కూడా రేపు విచారణలో తేలుతాయన్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకుంటామన్నారు. తప్పుడు పనులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు.
జగన్ లాంటి వారు ఉంటే..
ఇన్విజిలేటర్ మహేష్, వాటర్ బాయ్ లేదా అటెండర్ ప్రవీణ్ ఫోన్లను సీజ్ చేశామని చెప్పారు. ఇన్విజిలేటర్ను తొలగించామని, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉంటామన్నారు. వీరు ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఏం మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఓ సబ్జెక్ట్ గురించి తెలియదన్నారు.