ఏ నేరం చేయలేదు, ఆరోజే చెప్పేశా, కానీ..: అరెస్ట్ వారెంట్పై చంద్రబాబు స్పందన
అమరావతి: బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శ్రీశైలం జలాశయం వద్ద జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సున్నిపెంట వద్ద పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా బాబ్లీ ఎపిసోడ్, నాన్ బెయిలబుల్ వారెంట్లపై స్పందించారు.
అరెస్ట్ వారెంట్: నరకం చూశాం, చంద్రబాబు కన్నీరు: మోడీ, కేసీఆర్ కుట్రేనంటూ టీటీడీపీ ఫైర్
ఏ నేరం చేయలేదు
ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడామని చంద్రబాబు చెప్పారు. కానీ, బాబ్లీ కేసులో తనకు నోటీలిచ్చామని అంటున్నారని అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం తాము బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్తే.. నాటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే అరెస్టు చేశారని వివరించారు. ఎన్నోవిధాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారని చెప్పారు. తాను ఏ నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదన్నారు.
అరెస్ట్ వారెంట్: నరకం చూశాం, చంద్రబాబు కన్నీరు: మోడీ, కేసీఆర్ కుట్రేనంటూ టీటీడీపీ ఫైర్
బలవంతంగా విమానంలో..
‘ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను' అని చంద్రబాబు తెలిపారు. కేసులు పెట్టామని ఒకసారి, పెట్టలేదని మరోసారి చెప్పి బలవంతంగా ఒక ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్లో వదిలిపెట్టారన్నారు.
అధికారం ఉన్నా.. లేకున్నా..
ఇప్పుడేమో నోటీసులు పంపామని, అరెస్టు వారెంటు ఇచ్చామని మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ‘అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తాను. ఏ రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాల్లో వెలుగు వచ్చిందో ఆలోచించాలి' అని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పుకొచ్చారు.
ఇప్పుడెందుకు నోటీసులు?
ఇది ఇలా ఉండగా, ఎనిమిదేళ్ల క్రితం ఆందోళన చేసిన చంద్రబాబుకు ఇప్పుడు వారెంట్ ఇస్తూ నోటీసులు జారీ చేయడం ఏంటని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు కడితే తెలంగాణ ఎడారి అవుతుందనే ఆనాడు చంద్రబాబు పోరాటం చేశారని, పోలీసులు అరెస్టు చేస్తే ఐదు రోజుల తర్వాత బెయిల్పై వచ్చారని గుర్తు చేశారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
అదే మోడీ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు..
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్ ఇవ్వడం దారుణమన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు వాపసు తీసుకోవాలని, లేకపోతే ప్రజల ఆగ్రహం తప్పదని అన్నారు. ఈ వ్యవహారం మహారాష్ట్ర సీఎం, ప్రధాని మోడీ కలిసి చేస్తున్న కుట్ర అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతుంటే కేసీఆర్ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. బీజేపీ వ్యతిరేకులను అణగదొక్కడమే మోడీ ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు. మోడీ పద్ధతి మార్చుకోకుంటే దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. చంద్రబాబుకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేయడాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పారు.