పవన్కు రక్షణ కల్పిస్తాం: రేవంత్ ఇష్యూపై చంద్రబాబు, కేంద్రంపై నిప్పులు
హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తన అమెరికా పర్యటన గురించిన విశేషాలను వివరించారు. వివిధ అంశాలపై స్పందించారు. అమెరికా పర్యటనలో వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
రాష్ట్రంలో టవర్ల ఏర్పాటు, ఫైబర్ గ్రిడ్తో అనుసంధానంపై చర్చలు జరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో 3.5లక్షల ఎకరాల్లో రైతులు జడ్బీఎన్ఎఫ్ కింద వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు.
నన్ను చంపేయాలనుకుంటున్నారు, సీఎం కంటే ఎక్కువే అవుతా: పవన్ కళ్యాణ్ సంచలనం
ఏపీలో పరిశోధనా కేంద్రం..
ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. రైతులు రసాయనిక, క్రిమి సంహారక ఎరువులు లేకుండా సాగు చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. ప్రకృతి సేద్యాన్ని ఐక్యరాజ్యసమితి ఉత్తమ సేద్యంగా గుర్తించిందని, ప్రకృతి, సాంకేతికత అనుసంధానంతో కొత్త శక్తి ఏర్పడుతుందని వివరించారు. తద్వారా ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపినట్లు అవుతుందన్నారు. 2024 నాటికి 80లక్షల హెక్టార్లలో జడ్బీఎన్ఎఫ్ సేద్యానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. భూమిపై కంటే సముద్రంలో ఎక్కువ వనరులు ఉన్నాయని, సముద్రంలో మినరల్స్, ఆక్వా కల్చర్, నీటితో అనేక లాభాలు ఉన్నాయన్నారు. ఏపీలో పరిశోధన, సాంకేతిక కేంద్రం ఏర్పాటుకు డోయర్ సంస్థ అంగీకారం తెలిపిందని చంద్రబాబు వెల్లడించారు.
పవన్కు రక్షణ కల్పించాలి.. పేర్లు బయటపెట్టాలి
నేరాలు, నేర చరిత్రను ప్రోత్సహించే సమస్యే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తనకు ప్రాణహాని ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం సరికాదన్నారు. ప్రాణహాని ఉందని చెబితే భద్రత కల్పిస్తామన్నారు. ఆయన రక్షణ బాధ్యత పోలీసులు చూసుకుంటారన్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉంటే వారి పేరు బయటపెట్టాలని పవన్కు సూచించారు.
మావోయిస్టులతోపాటు ఇతర పార్టీల ప్రమేయం
రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత పెంచుతామని చెప్పారు. పోలీసు వ్యవస్థపై అందరికీ నమ్మకం ఉండాలని, రాష్ట్రంలో ఫ్యాక్షన్ నియంత్రించామని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు చనిపోయారనే బాధ ఉందని అన్నారు. హత్యల వెనుక అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. మావోయిస్టులతోపాటు ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు.
రేవంత్ ఐటీ దాడులపై చంద్రబాబు
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు.. తెలంగాణ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల అంశంపైనా పరోక్షంగా స్పందించారు. కేంద్రం పెద్ద దొంగలను పట్టుకోదని... అధికారాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. తమిళనాడులో ఏం జరిగిందో.. ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అంతా చూశారని చంద్రబాబు అన్నారు.
ఎన్నికలున్న ప్రతిచోటా.. అవినీతిపరుడిని కాపాడాలని..
ఎన్నికలున్న ప్రతిచోటా కేంద్రం ఇదే రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఐబీని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై వేచి చూడాలని అన్నారు. అవినీతి పరుడు బురదలో ఉండి బురద చల్లాలని చూస్తుంటే.. అవినీతి పరుడిని కాపాడాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తోందన్నారు. రాఫెల్ వ్యవహారంపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు బాబు.